తాండూరు, మే 14: సర్కార్ దవాఖానల్లో ప్రజలందరికీ కార్పొరేట్ స్థాయిలో మెరుగైన ఉచిత వైద్యం అందించేందుకు సీఎం కేసీఆర్ వైద్య రంగానికి ప్రత్యేక నిధులు కేటాయించారు. దీంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని రకాల మందులు, 24 గంటల వైద్యం అందించే సిబ్బంది, సత్వర వైద్యసేవల కోసం అంబులెన్స్, అమ్మ ఒడి వాహనాలను తెలంగాణ సర్కార్ ఏర్పాటు చేసింది. మాతాశిశు సంరక్షణే ధ్యేయంగా గర్భిణులు, బాలింతలకు తాండూరు జిల్లా దవాఖాన పుట్టింటిలా భరోసానిస్తున్నది. తల్లీబిడ్డల క్షేమం కోసం ఇంటి ప్రసవాలను అరికట్టి దవాఖానల్లోనే వందశాతం కాన్పులయ్యేలా చూడాలనే ఆలోచనతో కేసీఆర్ కిట్లు పంపిణీ చేస్తున్నది. ఈ పథకం అన్ని వర్గాల ప్రజల ఆదరణ పొందుతున్నది. లాక్డౌన్ నేపథ్యంలో ప్రైవేటు దవాఖానల్లో ఓపీ సేవలను ఎక్కువగా చూడకపోవడంతో జిల్లా ఆస్పత్రిలో ఓపీ సేవలు కూడా పెరిగాయి. ఈ దవాఖానలో అందిస్తున్న వైద్య సేవలతో ప్రజల్లో నమ్మకం పెరిగింది. 2020 మార్చి నుంచి 2021 మే 12వ తేదీ వరకు తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో 6,552 ప్రసవాలు చేసినట్లు వైద్యులు తెలిపారు.
నాణ్యమైన వైద్య సేవలు
తాండూరు జిల్లా దవాఖానలో నాణ్యమైన వైద్యం అందించడంతో రోజు రోజుకూ ప్రసవాల సంఖ్య పెరుగుతున్నది. కాన్పుల విషయంలో వైద్య సిబ్బం ది ప్రత్యేక శ్రద్ధ చూపడంతో జిల్లాలోని తాండూరు, వికారాబాద్, పరిగి, కొడంగల్తో పాటు సరిహద్దులోని కర్ణాటక నుంచి కూడా మహిళలు తాండూరు ప్రభుత్వ దవాఖానలో పురుడు పోసుకుంటున్నారు. తల్లీబిడ్డకు ఉపయోగపడే బట్టలు, వస్తువులతో కూడిన కేసీఆర్ కిట్టును అందించడంతో పాటు కాన్పు కోసం వచ్చేందుకు, డెలివరీ అయినాక తిరిగి ఇంటికి వెళ్లేందుకు అమ్మ ఒడి వాహనాన్ని ఏర్పాటు చేయడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కరోనా సమయంలో కూడా వైద్యులు, నర్సులు తల్లుల్లా చూసుకుంటూ పురుడు పోస్తున్నారని మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సంజీవనిలా రక్తనిధి కేంద్రం..
ప్రమాదాలకు గురై రక్తాన్ని కోల్పోతున్న క్షతగాత్రులు, ఆపరేషన్ల సమయంలో, ప్రసవం సమయంలో గర్భిణులకు జిల్లా దవాఖానలో ఏర్పాటు చేసిన రక్తనిధి కేంద్రం సంజీవనిలా మారింది. వైద్యులు స్వచ్ఛంద సంస్థల సహకారంతో క్యాంపులు నిర్వహించి, రక్తం సేకరించి, రక్తనిధి కేంద్రంలో భద్రపరిచి, కావాల్సిన వారికి ఉచితంగా అందజేసి ప్రాణాలు కాపాడుతున్నారు. దీంతో ప్రభుత్వ ఆస్పత్రిపై ప్రజలకు మరింత నమ్మకం కలుగుతున్నది. దాతలు కూడా ముందుకొచ్చి రక్తం ఇచ్చి ప్రాణాలను కాపాడుతున్నారు.
ఓపీ కూడా పెరుగుతున్నది..
తాండూరు జిల్లా దవాఖానలో ప్ర సూతితో పాటు ఓపీ సేవల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. అ త్యవసరం అనుకుంటే తప్ప సెలువులు వినియోగించుకోవడం లేదు. అన్ని రోగాలకు సంబంధించిన మెడిసిన్ కూడా అందుబాటులో ఉంచాం. ఉన్నతాధికారుల సహకారం బాగుంది. వారి సూచనల మేరకు సంతోషంగా ప్రజలకు వైద్యం అందిస్తున్నాం.
– నీత, నర్సు, జిల్లా ఆస్పత్రి