తాండూరు, మే 14 : నియోజకవర్గంలో పకడ్బందీగా లాక్డౌన్ కొనసాగుతున్నది. శుక్రవారం మూడో రోజు కూడా ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు దుకాణాలు, రోడ్లపై జనసంచారం కనిపించినా.. ఆ తర్వాత ఇండ్లకే పరిమితమయ్యారు. గ్రామాల్లో ఉపాధి హామీ, వ్యవసాయ పనులు, ధాన్యం కొనుగోళ్లు జరిగాయి. ప్రజలు లాక్డౌన్కు సంపూర్ణ సహకారం అందిస్తున్నారు. లాక్డౌన్ సమయంలో పోలీసులు పట్టణంలోని వార్డులతో పాటు పల్లెల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. అనవసరంగా బయట తిరిగే వాహనదారులకు కౌన్సిలింగ్ ఇస్తూ జరిమానాలు విధించారు. తాండూరు-కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన కొత్లాపూర్ చెక్పోస్టు వద్ద పోలీసులు వాహనాల రాకపోకలపై దృష్టి సారించారు. అత్యవసర పరిస్థితుల్లో వచ్చిన వాహనాలను విస్తృతంగా తనిఖీలు చేసి పంపిస్తున్నారు. తాండూరు డీఎస్పీ లక్ష్మీనారాయణ, రూరల్ సీఐ జలెందర్రెడ్డి, పట్టణ సీఐ రాజేందర్రెడ్డి మాట్లాడుతూ కరోనాను నియంత్రించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న నిబంధనలు పాటించాలన్నారు. ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు.
పరిగిలో ప్రశాంతం..
పరిగి, మే 14 : లాక్డౌన్ మూడో రోజు పరిగిలో ప్రశాంతంగా కొనసాగింది. ఉదయం 10 గంటల లోపు సడలింపులు ఉండటంతో వ్యాపార కార్యక్రమాలు కొనసాగాయి. 10 గంటల తర్వాత రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ప్రధాన రహదారులపై పోలీసులు చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. పరిగి గంజ్రోడ్డు, మార్కెట్ రోడ్డు వెలవెలబోయాయి. సీఐ లక్ష్మిరెడ్డి, ఎస్సై క్రాంతికుమార్ పాటిల్ లాక్డౌన్ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు.
లాక్డౌన్ నిబంధనలు పాటించాలి
పూడూరు, మే 14 : ప్రభుత్వం విధించిన లాక్డౌన్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని చన్గోముల్ పోలీస్స్టేషన్ ఎస్సై శ్రీశైలం అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని అన్ని ప్రాంతాల్లో ప్రజలు ప్రశాంతంగా లాక్డౌన్ పాటించారు. హైదరాబాద్-బీజాపూర్ హైవేపై ఏర్పాటు చేసిన చెక్ పోస్టు వద్ద 10 గంటల తర్వాత వచ్చే వాహనాలను ఆపి తనిఖీలు చేశారు. 10 గంటల తర్వాత అనవసరంగా బయటికి వస్తే వాహనాలను సీజ్ చేస్తామన్నారు.