తగ్గుతున్న కరోనాపాజిటివ్ కేసులు
లాక్డౌన్, ఇంటింటి జ్వర సర్వేలతో సత్ఫలితం
పెరిగిన టెస్టులు.. పీహెచ్సీల్లో నమోదు కానీ కేసులు
నేటి నుంచి 16 ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు వ్యాక్సినేషన్
జిల్లావ్యాప్తంగా మూడు రోజుల్లో 12,454 మందికి..
పరిగి, జూన్ 13 : కరోనా మహమ్మారి కట్టడి కోసం సర్కారు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఓవైపు కరోనా పరీక్షలు నిర్వహిస్తూ, పాజిటివ్ వచ్చిన వారికి వైద్యం అందజేస్తుండడంతోపాటు వ్యాక్సినేషన్ ప్రక్రియలో వేగం పెంచింది. తద్వారా వికారాబాద్ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతున్నది. కొన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నిర్వహిస్తున్న కరోనా పరీక్షల్లో అన్నీ నెగిటివ్ రావడం ఇందుకు ఉదాహరణగా పేర్కొనవచ్చు. వికారాబాద్ జిల్లావ్యాప్తంగా పకడ్బందీగా అమలు చేస్తున్న లాక్డౌన్తోపాటు దేశానికే ఆదర్శంగా నిలిచిన జ్వర సర్వే, సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సినేషన్ ప్రక్రియలతో రోజురోజుకు కరోనా కేసులు తగ్గిపోతున్నాయి. ఇదే పరిస్థితి మరో వారం పది రోజులు కొనసాగితే కరోనా పాజిటివ్ కేసులు సింగిల్ డిజిట్కు చేరుకుంటాయని వైద్యాధికారులు పేర్కొంటున్నారు. జిల్లావ్యాప్తంగా సోమవారం నుంచి 16 ప్రభుత్వ శాఖల ఉద్యోగులు 12,454 మందికి వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించారు. జిల్లాలో ఇప్పటివరకు 88,385 మందికి వ్యాక్సిన్ వేశారు.
తగ్గిపోతున్న పాజిటివ్ రేటు
జిల్లా వ్యాప్తంగా రోజురోజుకు నిర్వహిస్తున్న కరోనా పరీక్షల సంఖ్యను పెంచడంతోపాటు సరైన వైద్యం అందిస్తుండడంతో పాజిటివ్ రేటు తగ్గిపోతున్నది. వారం రోజులుగా నమోదవుతున్న కరోనా పాజిటవ్ కేసులను పరిశీలిస్తే ఈ నెల 6న జిల్లాలో 2562 కరోనా పరీక్షలు నిర్వహించగా 60 పాజిటివ్ కేసులు, 7న 2923 – 136, 8న 2776 – 130, 9న 2761 – 97, 10న 2664 – 79, 11న 2613 – 69, 12ప 2680 – 51, 13న 2248 పరీక్షలు జరుపగా 31 పాజిటివ్ కేసులు నమోదవడం గమనార్హం. జిల్లాలోని పలు గ్రామాల్లో రోజూ ప్రత్యేక శిబిరాలు ఏర్పాటుచేసి కరోనా పరీక్షలు నిర్వహిస్తుండగా అన్నీ నెగిటివ్ వస్తున్నాయి.
జిల్లావ్యాప్తంగా 88,385 మందికి వ్యాక్సినేషన్
ప్రభుత్వం కరోనా కట్టడిలో ప్రధానంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది. ఇందులోభాగంగా జిల్లాలోని తాండూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, నాలుగు సీహెచ్సీలు, 22 పీహెచ్సీలలో వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగిస్తున్నది. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 88,385 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. ఇటీవల ప్రభుత్వం సూపర్ స్ప్రెడర్లను గుర్తించి వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగిస్తున్నది. ఇందులో భాగంగా ఇప్పటివరకు తాండూరులో 2,967 మందికి, పరిగిలో 2,348 మందికి, వికారాబాద్లో 3,993 మందికి, కొడంగల్లో 1,054 మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్లు వైద్యాధికారులు తెలిపారు. ప్రజలతో నిత్యం సంబంధాలు గల వారికి వ్యాక్సిన్ వేయడం ద్వారా కరోనా వ్యాప్తిని వేగంగా అరికట్టవచ్చన్నది సర్కారు ప్రధాన ఉద్దేశం.
నేటి నుంచి 16 ప్రభుత్వ శాఖల వారికి వ్యాక్సిన్
వ్యాక్సినేషన్ ప్రక్రియలో వేగం పెంచిన సర్కారు సోమవారం నుంచి మూడు రోజులపాటు 16 ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగులకు కొవిడ్ వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా పంచాయతీరాజ్, ఇతర ఇంజనీరింగ్ విభాగాలు, విద్యుత్, రిజిస్ట్రేషన్, దేవాదాయ శాఖ, మున్సిపాలిటీలు, ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్, వ్యవసాయ శాఖ, వ్యవసాయ మార్కెట్ కమిటీలు, ఐకేపీ సిబ్బంది, వివిధ బ్యాంకుల సిబ్బందికి ఈ ప్రత్యేక డ్రైవ్లో వ్యాక్సిన్ వేయనున్నారు. వీరితోపాటు పూజారులు, మౌసమ్లు, ఇమామ్లు, పాస్టర్లు, అర్ఎంపీ వైద్యులు ఉన్నారు. ఈ ప్రత్యేక డ్రైవ్లో జిల్లావ్యాప్తంగా 12,454 మందికి వ్యాక్సిన్ వేయనున్నారు. తద్వారా మరింత వేగంగా కరోనా కట్టడి జరగనుంది.