నాటడానికి సిద్ధంగా 9.17 లక్షల మొక్కలు
మండలంలోని 49 నర్సరీల్లో పెంపకం
బొంరాస్పేట, జూన్ 13 : ఏడో విడుత హరితహారం కార్యక్రమానికి మండలంలో అధికారులు సన్నద్ధమవుతున్నారు. త్వరలో ప్రారంభమయ్యే హరితహారంలో ఉద్యమంలా మొక్కలు నాటేలా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. గ్రామాల్లో విస్తృతంగా మొక్కలు నాటడానికి ఒక్కో గ్రామానికి ఒక నర్సరీ చొప్పున గత ఏడాది నుంచి ఏర్పాటు చేశారు. మండలంలో 47 గ్రామ పంచాయతీల్లో 47 నర్సరీలు, అటవీశాఖ ఆధ్వర్యంలో రెండు సెంట్రల్ నర్సరీలు ఉన్నాయి. వీటన్నింటిలో కలిపి 9.17 లక్షల మొక్కలు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ శాఖల వారీగా మొక్కలు నాటడానికి అధికారులు ప్రణాళికలు తయారు చేసుకున్నారు. తమ శాఖల ద్వారా మొక్కలు నాటించాలని జిల్లా అధికారులు నిర్ధేశించారు. రైతుల పొలాలు, బ్లాక్ ప్లాంటేషన్, గ్రామాల్లోని ఇండ్లు, పాఠశాలలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లోని ఖాళీ స్థలాలు, రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటడానికి కార్యాచరణ ప్రణాళిక అధికారులు రూపొందించారు. ఇండ్ల వద్ద ఎక్కువగా పండ్లు, నీడనిచ్చే మొక్కలను నాటడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు.
మండలంలో 49 నర్సరీలలో 9.17 లక్షల మొక్కలు
మండలంలో మొత్తం 49 నర్సరీలు ఉండగా వాటిలో 9.17 లక్షల మొక్కలు నాటడానికి అందుబాటులో ఉన్నాయి. కొత్తూరు, బొంరాస్పేట గ్రామాల్లోని అటవీశాఖ ఆధ్వర్యంలో రెండు సెంట్రల్ నర్సరీలలో 4 లక్షల మొక్కలు పెంచుతున్నారు. మిగతా 47 గ్రామాల్లోని వన నర్సరీలలో 5.17 లక్షల మొక్కలు అందుబాటులో ఉన్నాయి. సెంట్రల్ నర్సరీలో పొడవైన రావి, గుల్మొహర్, మర్రి, ఫెల్టోఫారం,సీమచింత, అల్లనేరేడు, గంగారావి, తెల్లమద్ది, నల్లమద్ది, గుమ్మడిటేకు, మహాగని, లంబు తదితర మొక్కలతో పాటు జామ, దానిమ్మ, నిమ్మ, టేకు, మునగ, ఉసిరి, చింత, ఖర్జూరా, గచ్చకాయ వంటి మొక్కలను పెంచుతున్నారు. బొంరాస్పేట సెంట్రల్ నర్సరీలో అశ్వగంధం, తిప్పతీగ, జట్రోఫా, శతవారి, పారిజాతం, వావిళ్లు, మెహిందీ, నిమ్మగడ్డి వంటి 20 వేల ఔషధ మొక్కలను పెంచుతున్నారు. ఇవే కాకుండా జాతీయ రహదారికి ఇరువైపులా మొక్కలు నాటేందుకు హైవే అథారిటీ అధికారులు రెండు సెంట్రల్ నర్సరీలలో 80 వేల పొడవైన మొక్కలను పెంచుతున్నారు. టేకు మొక్కలు నాటి పెంచితే భవిష్యత్తులో రైతులకు మంచి ఆదాయం లభించనుండడంతో రైతులు వీటిపైనే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. రైతుల అభీష్టానికి అనుగుణంగా అధికారులు కూడా ఈ సారి ఎక్కువగా టేకు మొక్కలను పెంచి సరఫరా చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. రోడ్లకు ఇరువైపులా పొడవైన మొక్కలు నాటడానికి అధికారులు ప్రణాళికలు రూపొందించారు.
టేకు మొక్కలపై రైతుల ఆసక్తి
హరితహారంలో టేకు మొక్కలు నాటడానికి రైతులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. పొలం గట్లపై, ఖాళీ స్థలాల్లో వీటిని నాటితే భవిష్యత్తులో పెరిగి ఆదాయం ఇస్తాయని వీటిని నాటుకుంటున్నారు. రైతుల ఆసక్తి మేరకు గ్రామాల్లోని నర్సరీలలో టేకు మొక్కలను పెంచుతున్నారు.