రేపటి నుంచి రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం
వికారాబాద్ జిల్లాలో 2.39 లక్షలు, రంగారెడ్డి జిల్లాలో 3.15 లక్షల మంది రైతులు
గతేడాదికి కంటే పెరిగిన రైతులు 8 వేలు
మొదటి విడుతలో ఎకరం, రెండు ఎకరాలున్నవారికి..
అనంతరం అందరికి అందేలా ప్రభుత్వం చర్యలు
ప్రస్తుతం కురిసిన వర్షాలతో పంటల సాగు పనిలో అన్నదాతలు
వికారాబాద్ జిల్లాలో2,39,926 మందికి సాయం..
పరిగి, జూన్ 13 : గతంలో ఎకరాకు ఒక పంటకు రూ.4వేలు అందిస్తుండగా, ప్రస్తుతం ఎకరాకు ఒక పంటలకు రూ.5వేల చొప్పున రైతుబంధు ద్వారా ఆర్థిక సాయాన్ని సర్కారు అందజేస్తున్నది. వికారాబాద్ జిల్లా పరిధిలో మొత్తం 97 క్లస్టర్లు ఉండగా, ఆయా క్లస్టర్ల వారీగా సీసీఎల్ఏ నుంచి వచ్చిన రైతుల వివరాల ఆధారంగా రైతు బంధు కింద పెట్టుబడి సాయం అందనున్నది. జిల్లాలోని 18 మండలాల పరిధిలో గత యాసంగిలో రైతు బంధు కింద 2,30,639 మంది రైతులకు రూ.310.61కోట్లు మంజూరు కాగా.. వానకాలం 2,39,926 మందికి రూ.311.69 కోట్లు అందించనున్నారు. యాసంగి సీజన్ కంటే ఈసారి 9,287 మంది పైచిలుకు అదనంగా రైతుబంధు సాయం అందనున్నట్లు సమాచారం.
పెట్టుబడికి ఇబ్బంది లేదు..
ప్రతిసారి సీజన్లో పంటల సాగు చేపడుతున్న సమయంలోనే పెట్టుబడికి సాయం అందజేయడం ద్వారా ఇబ్బంది లేకుండాపోయిందని రైతులు పేర్కొంటున్నారు. ఏ ఒక్కరికి రూపాయి ఇవ్వకుండా, అత్యంత పారదర్శక విధానంలో సంబంధిత రైతులకు గల భూమి ఆధారంగా రైతు బంధు సాయం నేరుగా రైతు బ్యాంకు ఖాతాలో జమవుతున్నది. ఓవైపు రైతు బంధు, రైతు బీమా పథకాల అమలుతో తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచింది.
రంగారెడ్డిజిల్లాలో 314,945 మంది రైతులు
షాబాద్, జూన్ 13 : 2021-22 సంవత్సరానికిగాను జూన్ 15వ తేదీ నుంచి 25వ తేదీ వరకు రంగారెడ్డిజిల్లా వ్యాప్తంగా రైతుల ఖాతాల్లో వానకాలం పంటల సాగుకు రైతుబంధు డబ్బులు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో గతేడాది వానకాలంలో 3,09,945 మంది రైతులకు సంబంధించి రూ. 371 కోట్ల నిధులు ప్రభుత్వం విడుదల చేసింది. ఈ ఏడాది మరో 5వేల మంది రైతులు మంది రైతులు పెరిగే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. కొత్తగా పట్టదారు పాసుబుక్కులు వచ్చిన రైతులు రైతుబంధు కోసం స్థానిక వ్యవసాయశాఖ కార్యాలయంలో దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం ఇవ్వడంతో రైతులు ఆయా మండలాల్లోని వ్యవసాయశాఖ కార్యాలయాల్లో దరఖాస్తులు చేసుకుంటున్నారు. కొంతమంది రైతుల బ్యాంకుల వివరాలు మారినా.. ఆయా బ్యాంకుల వివరాల ఐఏఫ్ఎస్సీ కోడ్లను తీసుకుని ఆన్లైన్లో నమోదు చేయిస్తుంది. దీంతో రైతులకు ఎప్పటిలాగానే గతంలో ఉన్న బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమకానున్నాయి.
అర్హులందరికీ డబ్బులు అందేలా చర్యలు..
వానకాలం సీజన్కుగాను ప్రభుత్వ ఆదేశానుసారం జిల్లాలో అర్హులైన రైతులందరికి రైతుబంధు డబ్బులు అందేలా చర్యలు చేపడుతున్నాం. గతంలో మాదిరిగానే రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి. కొత్తగా పట్టదారు పాసుబుక్కు వచ్చిన రైతులు రైతు బంధు కోసం దరఖాస్తులు చేసుకుంటున్నారు. దీంతోపాటు కొన్ని భూముల వివరాలు మార్పు, చేర్పు చేస్తుండడంతో మరో 5వేల మంది వరకు రైతులు పెరుగనున్నారు. ఈ నెల 15 నుంచి 25వ తేది వరకు అర్హులైన రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
గీతారెడ్డి, రంగారెడ్డి జిల్లా వ్యవసాయశాఖ అధికారి
సీఎం కేసీఆర్ ఆదుకుంటుండు..
సీఎం కేసీఆర్ రైతుబంధుతో రైతులను ఆదుకుంటుండు. పెట్టుబడికి సాయం చేయడం, ధాన్యానికి మద్దతు ధర ఇవ్వడం చాలా సంతోషకరం. సాయం అందుతుండడంతో రైతుల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది.
రాంచంద్రారెడ్డి, రైతు, బార్లపల్లి గ్రామం,
పూడూరు మండలం
విత్తనాలు, ఎరువులు కొంటా..
రైతుబంధు సాయంతో విత్తనాలు, ఎరువులు కొంటా. పొలాన్ని పంటలు వేసేందుకు సిద్ధం చేసుకున్నా. అదునుకు సాయమందిస్తున్న సీఎం కేసీఆర్ సారు చల్లంగ ఉండాలే.
బి.పాండు, రైతు, అంగడి చిట్టంపల్లి గ్రామం, పూడూరు మండలం
అప్పుల బాధ తప్పింది..
రైతు బంధు సాయంతో అప్పులు చేసే బాధ తప్పింది. వానకాలం వచ్చిందంటే చాలు పెట్టుబడికి వెతుకులాట ఉండేది. పెట్టుబడి సాయం అందిస్తున్న సీఎం కేసీఆర్కు రైతులమంతా రుణపడి ఉంటాం.
రమణారెడ్డి, రైతు, మెట్లకుంట, బొంరాస్పేట