షాబాద్, మే 12 : కరోనా వైరస్ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. బుధవారం చేవెళ్ల నియోజకవర్గం పరిధిలోని షాబాద్, చేవెళ్ల, మొయినాబాద్, శంకర్పల్లి మండలాల్లో లాక్డౌన్ సందర్భంగా దుకాణాలు బంద్ చేశారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ప్రజలు నిత్యావసర సరుకులు తెచ్చుకున్నారు. 10 గంటల తర్వాత ఆర్టీసీ బస్సులు డిపోలకు వెళ్లాయి. రోడ్లపై ప్రజలు ఎవరూ కనిపించలేదు. ప్రధాన చౌరస్తాల వద్ద చెక్పోస్ట్లు ఏర్పాటు చేసి ఏసీపీ రవీందర్రెడ్డి ఆధ్వర్యంలో సీఐలు, ఎస్ఐలు బందోబస్తు చేపట్టారు. ప్రతి వాహనాన్ని ఆపి వివరాలు తెలుసుకుని అత్యవసరమైతేనే ఇతర ప్రాంతాలకు అనుమతించారు.
షాద్నగర్లో..
షాద్నగర్, షాద్నగర్టౌన్, మే 12 : నియోజకవర్గంలో వైద్యం, వ్యవసాయం, సమాచారం, అత్యవసర సేవలు మినహా అన్ని రంగాల కార్యకలాపాలు కొనసాగలేదు. కొత్తూరు, ఫరూఖ్నగర్, నందిగామ, కొందుర్గు ప్రాంతాల్లో ప్రభుత్వం అనుమతిపొందిన పరిశ్రమలు మినహా మిగత పరిశ్రమలు మూతపడ్డాయి. షాద్నగర్ ఏసీపీ కుశాల్కర్, సీఐ నవీన్కుమార్ లాక్డౌన్ తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. టీకా వేసుకునే వారికి సాయంత్రం 4గంటల వరకు అనుమతి ఉందన్నారు. షాద్నగర్ ప్రభుత్వ దవాఖానలో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ బుధవారం రెండోడోస్ టీకా వేయించుకున్నారు. టీకాపై అపోహలు వద్దన్నారు.
మొదటి రోజు సక్సెస్
మండల కేంద్రంతో పాటు హిమాయత్నగర్,అజీజ్నగర్, అమ్డాపూర్, తోలుకట్టా గ్రామాల చౌరస్తాలు బోసిపోయాయి. హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై ట్రాన్స్పోర్టు వాహనాలు తప్ప ఇతర వాహనాలు కనిపించలేదు. అనవసరంగా రోడ్ల మీద తిరిగే వారి వాహనాలను సీజ్ చేశారు.
కొత్తూరులో..
ఉమ్మడి కొత్తూరు మండలంలో లాక్డౌన్ పకబ్బందీగా కొనసాగింది. పోలీసులు రోడ్డపైకి ఎవరూ రాకుండా చూస్తున్నారు.
నందిగామ మండలంలో..
నందిగామతో పాటు గ్రామాల్లో లాక్డౌన్ కొనసాగుతున్నది. వాక్సిన్, కొవిడ్ పరీక్షల కోసం వచ్చేవారికి ఆటంకం లేకుండా సెంటర్కు పంపించారు.
శంకర్పల్లిలో..
పట్టణంలో లాక్డౌన్ సందర్భంగా ప్రజలు ఉదయం 7 గంటల నుంచి తమకు కావాల్సిన సరుకులను కొనుగోలు చేశారు. బుధవారం జరుగాల్సిన పశువుల అంగడి జరుగలేదు. హైదరాబాద్, సంగారెడ్డి, చేవెళ్ల రోడ్లు నిర్మానుష్యంగా మారాయి.
కేశంపేటలో..
కేశంపేట, మే 12 : ఉదయం 6 నుంచి 10 గంటల వరకు అన్ని గ్రామాల్లో కిరాణ షాపులు, వ్యాపార సముదాయాలు తెరుచుకోగా ప్రజలు నిత్యావసర సరుకులను కొనుగోలు చేశారు. ప్రజలు బయట తిరగకుండా ఎస్ఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పోలీసులు గస్తీ నిర్వహించారు.
కొందుర్గులో..
కొందుర్గు, మే 12 : పంచాయతీ అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజలకు కరోనా, లాక్డౌన్పై అవగాహన కల్పిస్తున్నారు. ప్రజలు అత్యవసరాల కోసం మాత్రమే బయటికి వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని కొందుర్గు, జిల్లెడు చౌదరిగూడ పోలీసులు హెచ్చరించారు.