వికారాబాద్ (నమస్తే తెలంగాణ)/రంగారెడ్డి, మే 12, (నమస్తే తెలంగాణ): జిల్లాలో తొలిరోజు లాక్డౌన్ పక్కాగా అమలైంది. ఉదయం 10 గంటల వరకు నిత్యావసర సరుకుల కొనుగోలుకు వెసులుబాటు కల్పించిన పోలీసులు ఉదయం 10 గంటల తర్వాత లాక్డౌన్ పకడ్బందీగా అమలుచేశారు. అత్యవసర సర్వీసులు మినహా ప్రజలెవరూ బయటకు రాలేదు. రంగారెడ్డి జిల్లాలోని రహదారులన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. ప్రభుత్వ సూచనల మేరకు ప్రజలంతా ఇండ్లలోనే ఉంటూ కరోనా కట్టడిలో తాము సైతం అంటూ స్ఫూర్తిగా నిలిచారు. ప్రభుత్వ కార్యాలయాలు తక్కువ మంది ఉద్యోగులతో కొనసాగాయి. లాక్డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చిన మెజారిటీ పరిశ్రమలు యథావిధిగా కొనసాగాయి. పలు ప్రాంతాల్లో మూతపడ్డాయి. బ్యాంకులు కూడా కొనసాగాయి.
ఉదయం 6 నుంచి 10 గంటల వరకు
ఉదయం 6 నుంచి 10 గంటల వరకు నిత్యావసర సరుకుల కొనుగోలుకు అవకాశం ఇవ్వడంతో జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోని దుకాణాలు, కూరగాయల మార్కెట్లు జనంతో కిక్కిరిశాయి. రేషన్ దుకాణాలు కూడా ఉదయం 10 గంటల వరకు కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా సరుకులు పంపిణీ చేశాయి. 10 గంటల తర్వాత లాక్డౌన్ అమల్లోకి రావడంతో జిల్లా అంతటా ప్రజా రవాణాతోపాటు వ్యాపార, మద్యం దుకాణాలు, ప్రైవేట్ వాహనాలు పూర్తిగా బందయ్యాయి. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ప్రజలెవరూ బయటకు రావద్దని, అనవసరంగా బయటకొస్తే కేసులు నమోదు చేస్తామని, వాహనాలు సీజ్ చేస్తామని పోలీసులు హెచ్చరించడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. కరోనా వ్యాప్తిని అరికట్టడంలో ప్రభుత్వానికి సహకరించాలని జిల్లా ఉన్నతాధికారులు కోరుతున్నారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేసి పోలీసులు తనిఖీలు నిర్వహించారు. లాక్డౌన్ సమయంలో అనవసరంగా బయటకొచ్చిన వారి వాహనాలు సీజ్ చేశారు. ఇతర జిల్లాలకు వెళ్లాలంటే పోలీసుల నుంచి తప్పనిసరిగా పాస్ తీసుకోవాలని ఉన్నతాధికారులు సూచించారు. ఎక్కడైనా ఐదుగురి కంటే ఎక్కువ గుమిగుడితే చర్యలు తీసుకుంటామని పోలీసు యంత్రాంగం హెచ్చరించింది.
తొలి రోజు ప్రశాంతం..
జిల్లా అంతటా తొలిరోజు లాక్డౌన్ ప్రశాంతంగా కొనసాగింది. షాద్నగర్ నియోజకవర్గంలో లాక్డౌన్కు ప్రజల నుంచి పూర్తిస్థాయిలో మద్దతు లభించింది. కొత్తూరు, ఫరూఖ్నగర్, నందిగామ, కొందుర్గు ప్రాంతాల్లో ప్రభుత్వం అనుమతి పొందిన పరిశ్రమలు మినహా, మిగతావి మూతపడ్డాయి. నాట్నో, ఎంఎస్ఎన్, పీ అండ్ జీ, వినియల్ కెమికల్ వంటి పరిశ్రమలతో పాటు వ్యవసాయ ఉత్పత్తుల పరిశ్రమలు యథావిధిగా కొనసాగాయి. లాక్డౌన్తో పట్టణ ప్రాంతాల్లో భవన నిర్మాణ పనులు నిలిచిపోయాయి. గ్రామీణ ప్రాంతాల్లో దిన సరి కూలీలు వ్యవసాయ పనులకు పరిమితమయ్యారు. షాద్నగర్ డిపో నుంచి హైదరాబాద్, మహబూబ్నగర్, పరిగి వంటి ప్రధాన మార్గాల్లో ఆర్టీసీ సేవలు కొనసాగాయి. చేవెళ్ల నియోజకవర్గంలో చేవెళ్ల, షాబాద్, మొయినాబాద్, శంకర్పల్లి మండలాల్లో దుకాణాల వద్ద పెద్దఎత్తున నిత్యావసర సరుకులు కొనుగోలు చేశారు. వారానికి సరిపడా సరుకులు, కూరగాయలు ఒకేరోజు కొన్నారు. నియోజకవర్గంలోని అన్ని బ్యాంకులు ఉదయం నుంచి సాయంత్రం వరకు తెరిచి ఉన్నాయి. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని పరిశ్రమలన్నీ మూతపడ్డాయి. సాగర్ రహదారిపై చెక్పోస్టులు ఏర్పాటు చేసి అత్యవసర సర్వీసులు మినహా మిగతా వాహనాలను తనిఖీ చేసి ఎలాంటి అనుమతి లేనట్లయితే సీజ్ చేశారు.
వికారాబాద్ జిల్లాలో..
వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా పటిష్టంగా లాక్డౌన్ అమలవుతున్నది. ఉదయం 6 నుంచి ఉదయం 10 గంటల వరకే లాక్డౌన్ సడలించారు. దీంతో ఉదయం 6 గంటలకే దుకాణాలు తెరుచుకున్నాయి. టీకా కోసం వెళ్లే వారికి, అత్యవసర సర్వీసులకు లాక్డౌన్ నుంచి మినహాయింపులు ఇచ్చారు. జిల్లా ఎస్పీ నారాయణ ఆధ్వర్యంలలో జిల్లా పోలీసులు లాక్డౌన్ను కఠినంగా అమలుచేస్తున్నారు. జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్కు నాలుగు ఆర్టీసీ బస్సులు ఒక్క ట్రిప్పుతో సరిపెట్టుకున్నాయి. తాండూరు, శంకర్పల్లి, చేవెళ్ల, మోమిన్పేట్, పరిగి తదితర పట్టణాలకు ఆర్టీసీ సర్వీసులు నడిచాయి. 33 శాతం సిబ్బందితో ప్రభుత్వ కార్యాలయాలు పనిచేశాయి. ధాన్యం కొనుగోళ్లకు ఎక్కడా ఆటంకం లేకుండా కొనసాగించారు. ఉపాధి హామీ పనులు యథాతదంగా కొనసాగించారు. 10 గంటల వరకు ప్రజలు వారికి కావాల్సిన సరుకులు, కూరగాయలు, ఇతరత్రా సామగ్రి కొనుగోలు చేశారు. జనం ఇండ్లకే పరిమితం కావడంతో ప్రధాన రహదారులు, పట్టణాల్లోని కాలనీల రోడ్లు నిర్మానుష్యంగా కనిపించాయి. రాకపోకలు లేక రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు ఖాళీగా దర్శనమిచ్చాయి.
ముమ్మరంగా పోలీసుల తనిఖీలు
తాండూరు మండలంలోని కొత్లాపూర్, కొడంగల్ మండలం రావులపల్లిల వద్ద ఏర్పాటు చేసిన అంతర్ రాష్ట్ర సరిహద్దులో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. జిల్లాలోని ఆయా మండలాల్లో రహదారులపై పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టారు. ఎస్పీ నారాయణ జిల్లా కేంద్రంలో పర్యటించి లాక్డౌన్ పరిస్థితులను సమీక్షించారు. జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు అందరూ పక్కాగా లాక్డౌన్ అమలయ్యేలా చర్యలు తీసుకున్నారు. అనవసరంగా రోడ్లపైకి వస్తున్న వారికి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. మరికొన్నిచోట్ల నిబంధనలు ఉల్లఘించిన వారిపై కేసులు నమోదుచేశారు.
ఈ-పాస్లకు 31 మంది దరఖాస్తులు
ఎస్పీ నారాయణ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా లాక్డౌన్ నిబంధనలు కట్టుదిట్టంగా అమలుచేస్తున్నారు. వికారాబాద్-హైదరాబాద్, వికారాబాద్-తాండూరు-కర్ణాటక, పరిగి-కొడంగల్-కర్ణాటక ప్రధాన రహదారులను పోలీసులు దిగ్బంధం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో వాహనాల పాసుల కోసం http://policeportal.tspolice.gov.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అత్యవసర ప్రయాణానికి ఈ పాస్ తప్పనిసరి చేశారు. మొదటి రోజు జిల్లా పోలీస్ శాఖకు ఈ-పాస్లకోసం 31 మంది దరఖాస్తు చేసుకున్నారు. మ్యారేజెస్, మెడికల్, అత్యవసరం అయిన వారికి పాస్లు జారీ చేసినట్లు జిల్లా అదనపు ఎస్పీ రశీద్ తెలిపారు.
వికారాబాద్ జిల్లాలో..
వికారాబాద్ జిల్లాలోని ఆర్టీసీ డిపోల నుంచి 45 బస్సులు వివిధ మార్గాల్లో నడిపారు. దాదాపు అన్ని బస్సులు 80 ట్రిప్పులు నడిచాయి. దీంతో కలెక్షన్ రూ.4.72 లక్షలు వచ్చింది. సాధారణ రోజుల్లో వైన్స్ షాపుల నుంచి ఒక్క రోజు రూ.కోటి పైగా ఆదాయం వచ్చేది. బుధవారం లాక్డౌన్ కారణంగా నాలుగు గంటల వ్యవధిలో రూ.61 లక్షల ఆదాయం వచ్చింది.