కొడంగల్, మే 12 : కరోనా కట్టడికి ప్రభుత్వం 10 రోజుల పాటు లాక్డౌన్ విధించడంతో మొదటి రోజు బుధవారం ఉదయం 10 గంటలకు పట్టణ రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు లాక్డౌన్ సడలింపు సౌకర్యాన్ని కల్పించడంతో పట్టణంలో ప్రతి బుధవారం జరిగే సంతలో జనాలు కూరగాయలు, పండ్లు తదితర వస్తుల కొనుగోళ్లు చేశారు. 10 గంటల తరువాత జనాలు రోడ్లపైకి కాకుండా ఇంటికే పరిమితమయ్యారు. పోలీసులు ఆయా కూడళ్లలో పోలీసు పహారా నిర్వహించి కట్టుదిట్టం చేశారు. లాక్డౌన్ నిర్ణయానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని సీఐ అప్పయ్య ప్రజలకు అవగాహన కల్పించారు.
మోమిన్పేటలో..
మోమిన్పేట మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో ప్రశాంతంగా లాక్డౌన్ చేపట్టారు. ఎస్సై శేఖర్గౌడ్ పోలీస్ సిబ్బందితో మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద తనిఖీ చేపట్టారు.
తొరుమామిడిలో..
మండల కేంద్రంతో పాటు తొరుమామిడిలో లాక్డౌన్ సంపూర్ణంగా కనిపించింది. ఉదయం 10 గంటల వరకు వివిధ వ్యాపారాలు కొనసాగించగా, 10 గంటల తరువాత అన్ని దుకాణ సముదాయాలు మూసివేశారు. ఇతర గ్రామాల్లో ప్రజలు వ్యవసాయ పనులు మినహా ఇతర పనులు అన్ని బంద్ పెట్టారు.మండలంలో కట్టుదిట్టంగా లాక్డౌన్ అమలు చేస్తున్నారు. బుధవారం హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారితో పాటు పలు గ్రామాల్లో పోలీసులు లాక్డౌన్ పకడ్బందీగా అమలు చేశారు. మండల కేంద్రంలోని ఎస్బీఐతో పాటు ప్రభుత్వ కార్యాలయాల వద్ద జన సంచారం పెద్దగా కనిపించలేదు.