కులకచర్ల, జూన్ 11: సంక్షేమ పథకాలను అమలుచేయడంలో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలుస్తున్నదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం చౌడాపూర్ పంచాయతీ నూతన మండలంగా ఏర్పడిన సందర్భంగా, గ్రామ సర్పంచ్ కొత్త రంగారెడ్డి అధ్యక్షతన నూతన కార్యాలయాలను ఆమె ప్రారంభించారు. అనంతరం కులకచర్లలో రూ.80 లక్షలతో పీఏసీఎస్ భవనం, రైతులకు విశ్రాంతి భవనాన్ని నిర్మించేందుకు మంత్రి శంకుస్థాపన చేశారు. తిర్మలాపూర్లో నాబార్డు నిధులు రూ.1.55 కోట్లతో నిర్మించిన గోదాంలను ప్రారంభించారు. పీఏసీఎస్ ఆధ్వర్యంలో రూ.80లక్షలతో నిర్మించే రైస్మిల్లు ఏర్పాటుకు ఆమె శంకుస్థాపన చేశారు. వచ్చే సీజన్ వరకు నిర్మాణాలను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొచ్చేలా చూస్తామని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో పరిపాలన సజావుగా కొనసాగించేందుకు ప్రభుత్వం కొత్త జిల్లాలు, మండలాలను ఏర్పాటు చేసిందన్నారు.
తండాలను పంచాయతీలుగా గుర్తించి.. వాటి అభివృద్ధికి భారీగా నిధులు విడుదల చేస్తున్నదన్నారు. పల్లె ప్రగతి ద్వారా మౌలిక వసతులు కల్పిస్తున్నదని తెలిపారు. వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు, పల్లె ప్రకృతి వనాలు తదితర నిర్మాణాలను చేపడుతున్నదన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై సీఎం కేసీఆర్ దృష్టి పెట్టారని, త్వరలో పనులు పూర్తి చేసి సాగు, తాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. చౌడాపూర్ ప్రజల ఆకాంక్షను చిత్తశుద్ధితో నెరవేర్చేలా పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి చేసిన కృషి అభినందనీయమన్నారు. గతంలో మాజీ ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్రెడ్డి పాఠశాలల అభివృద్ధికి కృషిచేశారని, ఇప్పటికీ అవి ఉపయోగపడుతున్నాయన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జోగులాంబ గద్వాలలో ఉన్న వికారాబాద్ జిల్లాను సీఎం చార్మినార్ జోన్లో చేర్చేందుకు కృషి చేశారన్నారు.
రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎకరాకు రూ.5వేల చొప్పున ఏడాదికి రూ.10వేలు సాయం చేస్తున్నదన్నారు. రైతు బీమాతో వారి కుటుంబాల్లో ధైర్యాన్ని నింపుతున్నదన్నారు. రానున్న రోజుల్లో జిల్లాలో పరిశ్రమల స్థాపన, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పనున్నదని తెలిపారు. రైతులు తాము పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు ఇబ్బందులు పడకుండా జిల్లాలో 90 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందన్నారు. త్వరలోనే 5వేల ప్రధానోపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయనున్నట్లు ఆమె తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి, కలెక్టర్ పౌసుమి బసు, అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య, ఎంపీపీ సత్యమ్మ, జడ్పీటీసీ రాందాస్నాయక్, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు పీరంపల్లి రాజు, ఎంపీటీసీ శంకర్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ నాగరాజు, గిరిజన ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సారా శ్రీనివాస్, నాయకులు అనీల్రెడ్డి, సుధాకర్రెడ్డి, హరికృష్ణ, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
సమిష్టి కృషితో అభివృద్ధి చేసుకోవాలి
నూతనంగా ఏర్పడిన మండలం చౌడాపూర్ ప్రజల చిరకాల కోరిక. వారి కోరికను నెరవేర్చిన ముఖ్యమంత్రి కేసీఆర్కు రుణపడి ఉన్నాం. కొత్త మండలాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమిష్టిగా కృషిచేయాలి. చౌడాపూర్తోపాటు ఇతర గ్రామాల నాయకుల పట్టుదలతో మండలాన్ని సాధించారు.
– కొప్పుల మహేశ్రెడ్డి, పరిగి ఎమ్మెల్యే