ధారూరు, ఏప్రిల్ 11 : 45 సంవత్సరాలు పైబడినవారు కొవిడ్-19 వ్యాక్సిన్ వేయించుకోవాలని ధారూరు, నాగసముందర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల డాక్టర్లు రాజు, రమేశ్బాబు తెలిపారు. ఆదివారం ధారూరులో 30 మందికి, నాగసముందర్లో 101 మందికి వ్యాక్సిన్ వేశారు. ఈ సందర్భంగా డాక్టర్లు మాట్లాడుతూ కేంద్రానికి వచ్చేటప్పుడు ఆధార్ కార్డును వెంట తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఏఎన్ఎం లు, ఆశావర్కర్లు ఉన్నారు.
కొనసాగుతున్న వ్యాక్సినేషన్
మర్పల్లి, ఏప్రిల్ 11 : మండలపరిధిలోని పట్లూర్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో ఆదివారం 45 ఏండ్లకు పైబడిన 215 మందికి వ్యాక్సిన్ వేసినట్లు ఎంపీవో సోమలింగం తెలిపారు.
మాస్కులు ధరించకుంటే జరిమానా
వికారాబాద్, ఏప్రిల్ 11 : పట్టణంలో ప్రజలు ఎక్కడైనా సరే మాస్కులు ధరించకుండా సంచరిస్తే జరిమానా విధిస్తామని ఎస్ఐ లక్ష్మయ్య అన్నారు. ఆదివారం వికారాబాద్లోని ప్రధాన కూడళ్ల వద్ద, పెద్ద షాపుల్లో ఆకస్మికంగా తనిఖీ చేసి మాస్కులు ధరించని ఏడుగురికి జరిమానా విధించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో రోజురోజుకూ కరోనా విపరీతంగా పెరిగిపోతున్నదని తెలిపారు. ప్రతి ఒక్కరై తమ కుటుంబం కోసం ఆలోచన చేయాలని సూచించారు.
మాస్కులు ధరించాలి
మర్పల్లి, ఏప్రిల్, 11 : ప్రతిఒక్కరూ మాస్కు ధరించాలని ఎస్సై వెంకట శ్రీను అన్నారు. ఆదివారం సాయంత్రం మర్పల్లిలోని పాత బస్టాండ్ దగ్గర కరోనా నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోజురోజుకు విస్తరిస్తున్న కరోనాతో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అనవసరంగా బయట తిరుగకుండా, బయటకు వస్తే మాస్కులు ధరించాలన్నారు. లేకపోతే రూ.1000 జరిమానా విధిస్తామని హెచ్చరించారు.