కులకచర్ల, మే 10: పల్లెలే దేశానికి పట్టుకొమ్మ లు.. పల్లెలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుంది.. గ్రామాల్లో ఎలాంటి సమస్యలు ఉండొద్దనే సదుద్దేశంతో సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టిన ‘పల్లె ప్రగతి’ కార్యక్రమంతో పల్లెలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి. ఇందులో భాగంగా మండల కేంద్రం అనంతసాగర్ గ్రామం రాష్ట్రం సిద్ధించకముందు అస్తవ్యస్తంగా ఉండేది. రాష్ట్రం వచ్చాక ఆ గ్రామంలో వినూత్న మార్పులు వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన గ్రామపంచాయతీ నిధులతో వివిధ అభివృద్ధి పనులను చేపట్టారు. ఇదివరకు తాగునీటి నానా తంటాలు పడిన గ్రామంలో ‘మిషన్ భగీరథ’ పథకంతో ఇంటింటికీ నల్లాలను వేయడం తాగునీటి వెతలు తీరాయి. 100 శాతం మరుగుదొడ్లను నిర్మించడంతో ఎవరూ కూడా బహిర్భూమికి వెళ్లకుండా ఉండడంతో స్వచ్ఛ గ్రామంగా మారింది. ప్రతివీధి సీసీ రోడ్ల నిర్మాణంతో చూడచక్కగా కనిపిస్తున్నాయి. రోడ్లపై మురుగునీరు పారకుండా మురుగునీటి కాల్వల నిర్మాణంతో వీధులు శుభ్రంగా మారాయి. ‘పల్లె ప్రగతి’ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో డంపింగ్యార్డు, వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనం నిర్మాణాలతోపాటు హరితహారానికి మొక్కలను సిద్ధంగా ఉంచేందుకు గ్రామ నర్సరీ నిర్మించారు.
పల్లెంతా పరిశుభ్రం..
నిత్యం గ్రామపంచాయతీ ట్రాక్టర్తో పంచాయతీ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన చెత్త బుట్టల్లో తడి, పొడి చెత్తను వేరు చేసి ఇస్తుండడంతో డంపింగ్ యార్డులో సేంద్రియ ఎరువును తయారు చేస్తున్నారు. గ్రామంలో ఎక్కడ చెత్త కనిపించినా సిబ్బంది శుభ్రం చేస్తుండడంతో పల్లెంతా పరిశుభ్రంగా మారింది. శుభ్రంగా ఉంటేనే వ్యాధులు దరిచేరవని సిబ్బంది నిత్యం గ్రామస్తులకు సూచిస్తున్నారు.
స్వచ్ఛ గ్రామంగా..
100 శాతం మరుగుదొడ్ల నిర్మాణంతో అనంతసాగర్ స్వచ్ఛ గ్రామంగా మారింది. ఎవరూ బహిర్భూమికి వెళ్లకుండా ఆదేశాలను జారీ చేశారు. బహిర్భూమికి వెళితే వచ్చే వ్యాధులపై గ్రామస్తులకు అవగాహన కల్పిస్తున్నారు. ఎవరైనా బహిరంగ మలవిసర్జన చేస్తే రూ.500 జరిమానా విధిస్తూ వారికి కౌన్సెలింగ్ ఇస్తున్నారు.
ఆహ్లాదకరంగా ‘పల్లె ప్రకృతి’
‘పల్లె ప్రకృతి వనం’ నిర్మాణంతో పల్లెకు పచ్చందం వచ్చింది. రకరకాల పూల మొక్కలతో పాటు అల్ల నేరెడు, నీలగిరి మొక్కలు నాటగా, ఏపుగా పెరిగి గ్రామస్తులకు ఆహ్లాదకర వాతావరణాన్ని అందిస్తున్నది. అంతేకాకుండా గ్రామ సమీపంలోని ప్రభుత్వ భూమిలో కొబ్బరి మొక్కలు, దానిమ్మ, అశోక, మందారం, బొడ్డుమల్లె, నీలగిరి వంటి మొక్కలను నాటడంతో పల్లెంతా పచ్చదనంతో కోనసీమను తలపిస్తున్నది.
రూ.60లక్షలతో అభివృద్ధి పనులు..
రూ.60లక్షల గ్రామపంచాయతీ నిధులతో పలు అభివృద్ధి పనులను చేపట్టారు. డంపింగ్యార్డు, వైకుంఠధామం నిర్మాణంతోపాటు ప్రతి వీధిలో సీసీ రోడ్లను నిర్మించారు. పంచాయతీ ట్రాక్టర్తో పాటు ఇతర పరికరాల కొనుగోలు చేశారు. పల్లె ప్రకృతివనం, ఎస్సీ, బీసీ, చిన్నరామయ్య తండాల్లో సీసీ రోడ్లను నిర్మించారు. మురుగునీటి కాల్వల ఏర్పాటు, 4 చెక్ డ్యాంలనూ నిర్మించారు. ఇంటింటికీ నల్లాలను వేయడంతో తాగునీటి సమస్య తీరింది.
గ్రామస్తుల సహకారంతో అభివృద్ధి
గ్రామస్తుల సహకారంతో గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుంటున్నాం. ‘పల్లె ప్రగతి’తో గ్రామ రూపురేఖలు మారాయి. వైకుంఠధామం, డంపింగ్ యార్డును నిర్మించాం. ప్రతి వీధిలో సీసీ రోడ్లు వేయించాం. ఎంపీటీసీ, పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు పూర్తి సహకారాన్ని అందిస్తున్నారు. సమష్టి కృషితో గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటాం.