కరోనా కట్టడికి కదిలిన ఊళ్లు
పల్లెల్లో సైతం కొవిడ్ విజృంభన
ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే..
తర్వాత మూతపడుతున్న దుకాణాలు
కరోనా మహమ్మారి నియంత్రణకు వికారాబాద్ జిల్లాలోని వికారాబాద్, తాండూరు, మల్కాపూర్, బషీరాబాద్, అత్తాపూర్, కుల్కచర్ల, చౌడాపూర్, బాసుపల్లి, మోత్కురుతో పాటు పలు గ్రామాలు స్వచ్ఛందంగా లాక్డౌన్ పాటిస్తున్నాయి. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపార సముదాయాలు తెరిచి ఉంచి, ఆ తర్వాత బంద్ చేయాలని నిబంధన విధించారు. దీంతో పల్లెజనం గడువులోపే నిత్యావసర సరుకులను కొనుగోలు చేసి, స్వీయ నియంత్రణ పాటిస్తున్నారు. గ్రామపంచాయతీలు తీర్మానం చేసిన నిబంధనలను అతిక్రమిస్తే జరిమానాలను సైతం విధిస్తున్నారు.
వికారాబాద్, మే 9, (నమస్తే తెలంగాణ)
వికారాబాద్, మే 9, (నమస్తే తెలంగాణ): కరోనా కట్టడికి స్వీయ నియంత్రణే శ్రీరామ రక్ష అని భావిస్తున్న గ్రామాల్లో అందరూ కలిసి తీర్మానించుకుని లాక్డౌన్ విధించుకుంటున్నారు. గతేడాది అంతంత మాత్రంగా వచ్చిన పాజిటివ్ కేసులకు ఎంతో హడావుడి సృష్టించింది కరోనా. ఈసారి సెంకడ్ వేవ్ విజృంభిస్తున్నది. అయినా ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలతో ఎంతోమందికి ఆక్సిజన్ అందిస్తూనే, మరింత మంది కోసం ఆక్సిజన్ బెడ్లు సిద్ధం చేస్తున్నది.
కట్టడి చేయాలనే ఉద్దేశంతో..
కరోనాను కట్టడి చేయాలనే ఉద్దేశంతో కొన్ని గ్రామాలు లాక్డౌన్ విధిస్తున్నాయి. వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈ ప్రక్రియ కొనసాగిస్తున్నారు. జిల్లాలో నిత్యం వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గ్రామాలు, తండాల్లో సైతం పదుల సంఖ్యలో వెలుగులోకి వస్తున్నాయి. దీంతో ఏ దవాఖానలో చూసినా కరోనా నిర్ధారణ పరీక్షల కోసం, నివారణ టీకా కోసం ప్రజలు బారులు తీరుతున్నారు. ఇటీవల కాలంలో ప్రతి రోజూ 1000 నుంచి 1500 మందికి పరీక్షలు నిర్వహిస్తున్నారు.
పంచాయతీల్లో ప్రత్యేక తీర్మానాలు
పెరుగుతున్న కేసులతో కరోనా వైరస్ కట్టడికి గ్రామాభివృద్ధి కమిటీలే చొరవ తీసుకుంటున్నాయి. పంచాయతీల్లో ప్రత్యేక తీర్మానాలు చేసి స్వచ్ఛందంగా లాక్డౌన్ ప్రకటించుకుంటున్నాయి. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మరికొన్ని గ్రామాల్లో 2 గంటల వరకు షాపులు తెరుచుకునేలా .. ఆ తర్వాత మూసివేసేలా తీర్మానించాయి. ఈ మేరకు ప్రజలకు అవగాహన కల్పిస్తూ సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. గ్రామాల శివారుల్లో దారులు మూసివేస్తూ ఇతర గ్రామాల నుంచి రాకపోకలు నిలిపివేస్తున్నారు. ఇతరులెవరూ తమ గ్రామానికి రావొద్దంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. ఇందుకు తగ్గట్టుగానే ప్రజలు ఇండ్లు దాటడం లేదు. ఎక్కడిక్కడ జనం ఇంటికే పరిమితమవుతున్నారు.
తాండూరు నియోజకవర్గంలో..
తాండూరులో 11 నుంచి 24 వ తేదీ వరకు 14 రోజుల పాటు లాక్ డౌన్ విధిస్తున్నట్లు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి ప్రకటించారు. పలు ప్రాంతాల్లో ఐసోలేషన్ కేంద్రాల ఏర్పాటుకు యాలాల కేజీబీవీ, మంతటిలో ఉన్న రైతు వేదికలను ఆయన పరిశీలించారు. 10 రోజుల పాటు పెద్దేముల్ మండల కేంద్రంలోఇదే మాదిరిగా లాక్డౌన్ విధించుకున్నారు. బషీరాబాద్ మండల కేంద్రం, తాండూరు మండలంలోని మల్కాపూర్ గ్రామంలో స్వచ్ఛంద లాక్డౌన్ కొనసాగుతున్నది. పెద్దేముల్ మండలంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో 10 రోజుల పాటు లాక్ డౌన్ విధిస్తున్నట్లు సర్పంచ్, వార్డు సభ్యులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ప్రకటించారు. ఇక్కడ ఉదయం 6 నుంచి 10 గంటల వరకే దుకాణాలు తెరుచుకునేలా నిర్ణయించారు.
మర్చంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో..
జిల్లా కేంద్రంలో ది గ్రేయిన్ అండ్ సీడ్స్ మర్చంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 23వ తేదీ వరకు లాక్ డౌన్ విధించుకున్నారు. చిగుళ్లపల్లి రమేశ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో 23 వరకు స్వచ్ఛందంగా పూర్తి లాక్డౌన్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.
జిల్లా వ్యాప్తంగా లాక్డౌన్
మర్పల్లి మండలంలోని షాపూర్ తండాలో ఈనెల 20వ తేదీ వరకు లాక్ డౌన్ విధించుకున్నారు. నవాబ్పేట మండలం అత్తాపూర్ పంచాయతీలో ఉదయం 6 నుంచి 8 గంటల వరకు మళ్లీ రాత్రి 6 నుంచి 8 గంటల వరకు దుకాణాలు తెరిచి ఉంటాయని ప్రకటించారు. ఇక్కడ 20 రోజుల పాటు లాక్డౌన్ విధించాలని గ్రామ సభలో తీర్మానించారు. బొంరాస్పేట్ మండలంలోని పలు గ్రామాల్లో స్వచ్ఛందంగా లాక్డౌన్ నిర్వహిస్తున్నారు. పరిగి మున్సిపాలిటీలో ఉదయం 6 నుంచి 11 గంటల వరకు బంద్ పాటిస్తున్నారు. మండలంలోని మిగతా పంచాయతీల్లో ఇదేవిధంగా కొనసాగుతున్నాయి. కుల్కచర్ల మండల కేంద్రం, చౌడాపూర్, దోమ మండల పరిధిలో బాసుపల్లి, మోత్కురు తదితర గ్రామాల్లో స్వచ్ఛందంగా లాక్ డౌన్ చేపట్టారు.