కరోనా వ్యాక్సిన్లు సరఫరా!
డ్రోన్లతో సరఫరా చేసేందుకు సన్నాహాలు
పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైన వికారాబాద్ జిల్లా
రోడ్డు మ్యాప్ సిద్ధం చేస్తున్న జిల్లా యంత్రాంగం
అనుమతులిచ్చిన డీజీసీఏ
మారుమూల ప్రాంతాలకు టీకాల సరఫరాకు రాష్ట్ర సర్కార్ వినూత్న నిర్ణయం
జిల్లా కేంద్రంలోని దవాఖాన నుంచి నాలుగు పీహెచ్సీలకు తరలించేందుకు సన్నాహాలు
రోడ్డు రవాణా సాధ్యంకాని మారుమూల ప్రాంతాలకూ కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేయాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఒరవడికి తెరలేపింది. ఆకాశ మార్గంలో డ్రోన్ల ద్వారా కొవిడ్ వ్యాక్సిన్లను సరఫరా చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే కేంద్ర విమానయాన శాఖ నుంచి అనుమతులు కూడా పొందింది. అదేవిధంగా ట్రయల్న్ నిర్వహించేందుకు వికారాబాద్ జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. మొదటగా జిల్లా కేంద్రంలోని ఏరియా దవాఖాన నుంచి నాలుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్లను తరలించేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తున్నది. దీనికోసం రోడ్డు మ్యాప్ సిద్ధం చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. డ్రోన్లతో వ్యాక్సిన్ల సరఫరా చేసేందుకు16 సంస్థలు ఆసక్తి కనబర్చగా.. అందులో 8 సంస్థలను ప్రభుత్వం ప్రాథమికంగా ఎంపిక చేసింది. ఈ ఎనిమిది సంస్థలను నాలుగు బ్యాచ్లుగా విభజించి ప్రయోగాత్మకంగా వ్యాక్సిన్ల తరలింపునకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
-వికారాబాద్, మే 8, (నమస్తే తెలంగాణ)
వికారాబాద్, మే 8, (నమస్తే తెలంగాణ): రోడ్డు రవాణా వ్యవస్థ లేని గ్రామీణ ప్రాంతాలకు ఆకాశ మార్గంలో డ్రోన్ల ద్వారా కొవిడ్ వ్యాక్సిన్ల సరఫరాకు గ్రీన్ సిగ్నల్ లభించింది. కేంద్ర విమానయాన శాఖ నుంచి అనుమతులు కూడా వచ్చాయి. అంతేకాకుండా డ్రోన్లతో వ్యాక్సిన్ సరఫరా చేయడం కోసం మానవరహిత విమాన వ్యవస్థ నిబంధనల్లో కొన్ని సడలింపులు చేస్తూ ఉత్వర్వులు జారీ చేసింది. డ్రోన్లతో ప్రయోగాత్మకంగా వ్యాక్సిన్ పంపిణీ చేయడానికి నిబంధనలతో కూడిన అనుమతులు అందాయి. ఈ ఆదేశాలు ఏడాది లేదా మళ్లీ ఆదేశాలు వచ్చే వరకు అమలులో ఉంటాయి. డ్రోన్లతో వ్యాక్సిన్ సరఫరా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం వికారాబాద్ జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. జిల్లా కేంద్రంలోని ఏరియా దవాఖాన నుంచి నాలుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రా(పీహెచ్సీ)లకు ప్రయోగాత్మకంగా తరలించేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తున్నది. ఇందులో ప్రధానంగా సిద్దూలూరు ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం ఉండగా.. మిగతా మూడు పీహెచ్సీల పేర్లను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్ పంపిణీకి ఇప్పటికే పౌర విమానాయానశాఖ ఆమోదం తెలుపగా.. కేంద్రం హోంశాఖ నుంచి క్లియరెన్స్ లభించాల్సి ఉన్నది. అయితే గత నెల 29వ తేదీన పౌర విమానయాశాఖ (ఎంవోసీఏ) కూడా విజువల్ లైన్ ఆఫ్ విజన్(వీఎల్వోఎస్) విధానంలో డ్రోన్ల ద్వారా మందులు లేదా వ్యాక్సిన్లు సరఫరా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర సర్కార్ డీజీసీఏ మద్దతుతో బీవీఎల్వోఎస్ డ్రోన్ల ద్వారా ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు ఆమోదం పొందింది.
సీహెచ్సీ, పీహెచ్లు ఇవే..
వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఏరియా దవాఖాన, మర్పల్లి, పరిగి, కొడంగల్ వైద్య విధాన పరిషత్ ఆస్పత్రులుండగా.. రామయ్యగూడ యూహెచ్సీ, చిట్యాల్, సిద్దులూరు, పట్లూర్, నవాల్గ, యాలాల్, పూడూర్, నవాబ్పేట్, జిన్గుర్తి, నాగసముద్రం, ధారుర్, చన్గోముల్, అంగడి రాయిచూర్, బషీరాబాద్, పెద్దేముల్, దోమ, బొంరాస్పేట్, బంట్వారం, దౌల్తాబాద్, కుల్కచర్ల, మోమిన్పేట్ తదితర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. జిల్లా కేంద్రం నుంచి డ్రోన్లతో వ్యాక్సిన్ను ఆయా పీహెచ్సీలకు ఎలా తరలించాలనే విషయమై జిల్లా యంత్రాంగం రోడ్ మ్యాప్ సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. వికారాబాద్ ఏరియా దవాఖాన నుంచి వ్యాక్సిన్లు ఉన్న డ్రోన్లను గ్రామీణ (మారుమూల) పల్లెల్లో ఉన్న ఆరోగ్య కేంద్రాలకు తరలించి ల్యాండింగ్ అయ్యే విధంగా రోడ్డు మ్యాప్ను సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రక్రియను పర్యవేక్షించే బాధ్యతను ప్రభుత్వం ఓ నోడల్ అధికారికి అప్పగించింది. డ్రోన్ల ద్వారా నిర్దేశించిన ఆరోగ్య కేంద్రాలకు సరఫరా చేసే వ్యాక్సిన్లు ఎంత టైంలో లక్ష్యానికి చేరుకుంటాయని ట్రయల్ రన్లో పరిశీలించనున్నారు.
8 సంస్థలు ఎంపిక..
డ్రోన్లతో వ్యాక్సిన్ల్ల్లు సరఫరా చేయడానికి 16 సంస్థలు ఆసక్తి కనబర్చాయి. అయితే అందులో 8 సంస్థలను ప్రభుత్వం ప్రాథమికంగా ఎంపిక చేసింది. ఈ ఎనిమిది సంస్థలను 4 బ్యాచ్లుగా విభజించి డ్రోన్ల సామర్థాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించేందుకు రోడ్డు మ్యాప్ సిద్ధం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.