వికారాబాద్, ఏప్రిల్ 7, (నమస్తే తెలంగాణ) : వచ్చే వానకాలం సాగు కోసం ఎరువుల ధరలు పెంచబోతున్నట్లు కంపెనీలు ఇప్పటికే ప్రకటించాయి. దీంతో ధరల పెంపు వల్ల జిల్లా రైతులపై దాదాపుగా రూ.5 నుంచి 10 కోట్ల భారం పడనుండడంతో ప్రభుత్వ తీసుకున్న ధరల నియంత్రణ చర్యలకు నిల్వ ఉన్న ఎరువులను పాత ధరలకే విక్రయించాలని కంపెనీలు నిర్ణయించాయి. దీంతో రైతులకు ఊరట లభించినట్లయింది. గతంతో పోలిస్తే డీఏపీ కంప్లెక్స్ ఎరువుల ధరలు చాలా సార్లు పెరిగాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఒక్కో బస్తాపై రూ.200 పెరుగుతుండటంతో రైతులపై అదనపు భారం పడే అవకాశాలు ఉన్నపటికీ ప్రభుత్వం పాత ధరలకే అమ్మాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు నిల్వ ఉన్న మొత్తాన్ని డివిజన్ల వారీగా డీలర్లకు విడుదల చేశాయి. ఎరువుల సంచులపై ఏ ధర ఉంటే అదే ధరతో రైతులు తీసుకోవాలని అధికారులు వెల్లడించారు.
సరఫరా షురూ
50 మెట్రిక్ టన్నుల మేర జిల్లాకు సరఫరా చేయడంతో జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో డీలర్లకు ఎరువులు బుధవారం చేరుకోగా.. నేడు కూడా జిల్లాకు సరుకు చేరనున్నది. పంట సాగులో విత్తనాలు, ఎరువులే కీలకం కావడంతో దిగుబడులు పొందేందుకు పంట చివరి దశవరకు నాలుగు, ఐదు సార్లు రైతులు ఎరువులను పొలాలకు వాడుతారు. ఈ లెక్కన ఎకరానికి రెండు నుంచి ఐదువేల మధ్యన ఖర్చు అవుతుందని రైతులు వెల్లడిస్తున్నారు. ఎరువుల ధరల పెరుగుదలతో ఈ సీజన్లో అదనంగా రూ.1000 నుంచి రూ.1500 ఖర్చు చేయాల్సి వచ్చేది. జిల్లాలో 5,84,157 ఎకరాల్లో సాగు చేసేందుకు 2.50 లక్షల మంది రైతులు సన్నద్ధమవుతున్నారు. అత్యధికంగా జిల్లాలో పత్తి, కంది, మక్కలు, ఇతర కూరగాయల పంటలు సాగు అవుతున్నాయి. ఇందుకు గాను లక్ష మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం అవుతాయని అధికారులు అంచనాలు వేస్తున్నారు.
అత్యధికంగా యూరియా, డీఏపీ రైతులు వినియోగిస్తారు. అలాగే కాంప్లెక్స్, ఎంవోపీ తదితర ఎరువులను రైతులు వాడుతుంటారు. పంటల సాగులో డీఏపీ వినియోగం ఎక్కువగా ఉంటుంది. దీనికి పాత ధర రూ. 1250 ఉండగా, పెంచిన ధర రూ.1450 అవుతుంది. జిల్లాకు యూరియా 32వేల 275మెట్రిక్ టన్నులు, డీఏపీ 15వేల 798, ఎంఓపీ 961, కాంప్లెక్సు 3633, ఎస్ఎస్పీ 9084 మొత్తం 1,03,109 మెట్రిక్ టన్నులు అవసరం ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. ప్రస్తుతం జిల్లాలో 10వేల మెట్రిక్ టన్నుల యూరియా, 800 డీఏపీ, ఏంఓపీ 875, ఎస్ఎస్పీ 550 మెట్రిక్ టన్నులు ఉన్నాయి. వీటన్నింటినీ పాత ధరలకే విక్రయించాల్సి ఉంటుంది. కాంప్లెక్సు ఎరువుల సంచిపై ధర 2వందల నుంచి 3వందలు పెరిగింది. జిల్లాలో అన్ని రకాల ఎరువులకు కలిపి 10వేల మెట్రిక్ టన్నులు నిల్వ ఉన్నాయి.
అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు
జిల్లాలో నిల్వ ఉన్న ఎరువులు పాత ధరలకే విక్రయించాలి. పెంచిన ధరలకు అమ్మితే కఠిన చర్యలు తప్పవు. ఇప్పుడు వచ్చిన ఎరువుల బస్తాలపై పాత ధరలు ముద్రించి ఉన్న నేపథ్యంలో పెరిగిన ధరలకు అమ్మకాలు కొనసాగిస్తే ఉపేక్షించేది లేదు. సంచుల ధరలపైన స్టిక్కర్లు వేసి అమ్మకాలు జరిపితే లైసెన్సులు రద్దు చేస్తాం. పాత ధరలకు అమ్మకపోతే రైతులు ఫిర్యాదు చేయండి. పర్యవేక్షణ బాధ్యత అధికారులదే.
ఇవీ కూడా చదవండీ..
కరోనా ఎఫెక్ట్ : 12 నుంచి శ్రీవారి సర్వదర్శనం నిలిపివేత
మాజీ సైనికుడి భార్య స్కెచ్ : ప్రియుడితో కలిసి భర్తను కడతేర్చి..
పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ : 50 నిమిషాలు.. 50 కోట్లు..