పరిగి, మే 6 : కరోనా మహమ్మారి కట్టడిలో భాగంగా కొవిడ్ లక్షణాలు ఉన్న వారిని గుర్తించేందుకు ఇంటింటా సర్వే నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో పరిగి మండల పరిధిలోని ప్రతి గ్రామంలో గురువారం సర్వే చేశారు. పరిగి మండలంలోని 37 గ్రామ పంచాయతీల్లో పంచాయతీ కార్యదర్శులు, ఆశవర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ఎవరైనా జ్వరంతో బాధపడుతున్నారా, కొవిడ్ లక్షణాలు ఎవరికైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. పరిగి మండల పరిధిలో మొత్తం 12,453 ఇండ్లు ఉండగా, గురువారం 5,537 ఇండ్లకు సంబంధించిన సర్వేను పూర్తి చేశారు. రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో ఇంటింటి సర్వే పూర్తి చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సర్వేలో భాగంగా మండల పరిధిలో దగ్గు, జ్వరం, ఒళ్లు నొప్పులు ఉన్నవారు 336మంది ఉన్నట్లు గుర్తించారు.
పెద్దేముల్, బండపల్లి, మదనంతాపూర్లో..
పెద్దేముల్ : మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గ్రామాల్లో ఇంటింటా జ్వర సర్వేను నిర్వహిస్తున్నారు. మండల పరిధిలోని పెద్దేముల్, బండపల్లి, మదనంతాపూర్, దుగ్గాపూర్, జయరాంతండా, కందనెల్లి, అడికిచెర్ల, మంబాపూర్, గొట్లపల్లి, గిర్మాపూర్, జనగాం, ఇందూరు, తదితర గ్రామాల్లో సర్వేను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు మాట్లాడుతూ సర్వేలో భాగంగా ఎంతమందికి జ్వరం, దగ్గు, జలుబు లాంటి లక్షణాలు ఉన్నాయి? రెండు మూడు రోజులుగా జ్వరం వచ్చినట్లయితే వారి ఆక్సిజన్ లెవల్స్ ఎలా ఉన్నాయి..? కరోనా సోకి హోం ఐసోలేషన్లో ఉంటున్న బాధితులకు కొవిడ్ కిట్లను ఆశవర్కర్లు అందించారా? వారి ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయి? అనే విషయాలను ప్రభుత్వం నిర్దేశించిన విధంగా వివరాలు నమోదు చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, ఆశవర్కర్లు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
యాలాల మండల పరిధిలో..
యాలాల : మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో పంచాయతీ సెక్రటరీ, ఆశవర్కర్లతో సర్వే నిర్వహించారు. ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలను సేకరించారు. మండల వ్యాప్తంగా 121 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు నిర్దారించారు. వారందరూ ఐసోలేషన్లో ఉన్నారు. మరో 100 మందికి స్వల్ప లక్షణాలు ఉన్నట్లుగా గుర్తించారు.
కులకచర్లలో..
కులకచర్ల : ప్రతి ఇంటికి తిరిగి జ్వర సర్వే నిర్వహిస్తున్నామని కులకచర్ల పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో ఇంటింటికీ అంగన్వాడీ, ఆశకార్యకర్త ఆధ్వర్యంలో సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇండ్లలో కుటుంబసభ్యుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ సర్వేను పంచాయతీ కార్యదర్శుల టీంతో కలిసి నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
దోమ మండలంలో..
దోమ : మండల పరిధిలోని దాదాపూర్, మైలారం, కిష్టాపూర్ సర్వే నిర్వహించినట్లు సర్పంచ్లు కృష్ణ, రాజునాయక్, సత్యమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఆశవర్కర్లు, పంచాయతీ కార్యదర్శుల ద్వారా ఆరోగ్య అంశాలను రికార్డు చేసి ప్రభుత్వానికి నివేదికను సమర్పిస్తామన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ గాఫర్, నర్సింహులు, పంచాయతీ కార్యదర్శులు రవీందర్రెడ్డి, అంజమ్మ, ఆశవర్కర్లు, సిబ్బంది పాల్గొన్నారు.