వికారాబాద్, జూలై 5 : రైతులు పండించాల్సిన పంటలు, వ్యవసాయ పద్ధతులను తెలుసుకొని లాభసాటి వ్యవసాయం చేసేందుకు గ్రామాల్లో రైతు వేదికలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి తెలిపారు. సోమవారం వికారాబాద్ మండల పరిధిలోని మైలార్దేవరంపల్లి రైతు వేదికను ఎమ్మెల్యే ఆనంద్తో కలిసి ప్రారంభించారు. పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యేతో కలిసి మైలార్దేవరంపల్లి చెరువు ఏర్పాటుకు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తామన్నారు. ఏ రకం పంటలు వేయాలన్నది పూర్తి స్థాయిలో రైతు వేదికల్లో వ్యవసాయాధికారులు రైతులకు అవగాహన కల్పిస్తారన్నారు.
గొట్టిముక్కల, సిద్దులూర్ గ్రామాల్లో రైతు వేదికలు ప్రారంభం
రైతాంగాన్ని సంఘటితం చేసేందుకు రైతు వేదికలు ఉపయోగపడుతాయని ఎమ్మెల్యే ఆనంద్ అన్నారు. రైతు వేదిక సమావేశాల కోసం కావాల్సిన కుర్చీలను, టేబుళ్లను ప్రభుత్వమే అందిస్తుందన్నారు. రైతులు మేలైన వంగడాలు ఎంపిక చేసుకునేలా, అధిక లాభాలు పొందే విధంగా వ్యవసాయాధికారులు కృషి చేయాలని తెలిపారు. నకిలీ విత్తనాలతో రైతులు మోసపోకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. అనంతరం 4వ విడుత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించి, రైతు వేదిక ఆవరణలో మొక్కలు నాటి నీరు పోశారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్లు తిరుపతిరెడ్డి, వెంకటేష్, అంజయ్య, ఎంపీపీ చంద్రకళ, పీఏసీఎస్ చైర్మన్ ముత్యంరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు కమాల్రెడ్డి, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు పురుషోత్తంరెడ్డి, రైతు బంధు సమితి అధ్యక్షుడు వెంకటయ్య, డీఏవో గోపాల్, ఏడీఏ వినోద్, ఏవో ప్రసన్నలక్ష్మి, ఎంపీడీవో సుభాషిణి, ఏఈవో పావని, ప్రతిభ, కావ్య, ఉప సర్పంచ్లు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.