తాండూరు రూరల్, జూన్ 3: సబ్డివిజన్ పరిధిలోని ఫర్టిలైజర్స్ దుకాణదారులు నకిలీ విత్తనాలు, మందులు విక్రయిస్తే వారి లైసెన్సులు రద్దు చేసి, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తాండూరు డీఎస్పీ లక్ష్మీనారాయణ అన్నారు. గురువారం తాండూరు ఎంపీడీవో కార్యాలయంలో ఫర్టిలైజర్స్ దుకాణదారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుకు నష్టం చేకూర్చే పని చేసే దుకాణదారులపై కచ్చితంగా చర్యలుంటాయన్నారు. తాండూరు, యాలాల, బషీరాబాద్, పెద్దేముల్, టౌన్లోని ఫర్టిలైజర్స్ దుకాణదారులందరూ ఎరువులు, క్రిమిసంహారక ముందులు కొనుగోలు చేసినప్పుడు విధిగా రైతులకు రసీదు ఇవ్వాలన్నారు. సమావేశంలో వ్యవసాయాధికారి రజిత, ఏఈవో శ్రీనివాస్ ఉన్నారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : ఎస్సై సురేశ్
యాలాల, జూన్ 3: నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం మోపుతున్నామని ఎస్సై సురేశ్ అన్నారు. యాలాల మండల పరిధిలోని పలు ఫర్టిలైజర్ దుకాణాలను ఏవో నజీరుద్దీన్తో కలిసి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నకిలీ విత్తనాలను విక్రయిస్తే క్రిమినల్ కేసులతో పాటు పీడీ యాక్టు నమోదు చేస్తామన్నారు. రైతులకు బిల్లులు తప్పకుండా ఇవ్వాలన్నారు.
తాండూరు పట్ణణంలో..
తాండూరు రూరల్, జూన్ 3 : ఫర్టిలైజర్స్ దుకాణాల్లో నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని తాండూరు రూరల్ సీఐ జలెందర్రెడ్డి హెచ్చరించారు. గురువారం తాండూరు పట్ణణంలోని పలు ఎరువుల దుకాణాల్లో ఎరువులు, విత్తనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రద్ధు చేసిన క్రిమిసంహారక మందులు, గడ్డివిత్తనాలు విక్రయిస్తే వారి లైసెన్సులు రద్దు చేస్తామన్నారు. అదేవిధంగా రైతుకు ఎరువులు, మందులు విక్రయించినప్పుడు రసీదు విధిగా ఇవ్వాలన్నారు. స్టాక్ పాయింట్ రిజిస్టర్, ప్రస్తుత రిజిస్టర్, అమ్మకాలు జరిపిన రిజిస్టర్ కచ్చితంగా ఉండాలని సూచించారు. ఈ పాస్ విధానంలోనే రైతులకు ఎరువులు విక్రయించాలన్నారు. ప్రభుత్వం నిర్ణయించన ధరలకే ఎరువులు, క్రిమిసంహారక మందులు రైతులకు ఇవ్వాలని సూచించారు. ఆయన వెంట వ్యవసాయాధికారి నసీరుద్దీన్ ఉన్నారు.
నాణ్యమైన విత్తనాలను విక్రయించాలి : ఎస్సై శ్రీశైలం
పూడూరు, జూన్ 3 : నకిలీ విత్తనాలు విక్రయించే వ్యాపారులపై చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని చన్గోముల్ పోలీస్స్టేషన్ ఎస్సై శ్రీశైలం అన్నారు. పూడూరు మండల పరిధిలోని మన్నెగూడ, చన్గోముల్లోని ఫర్టిలైజర్ దుకాణాలను ఎస్సై శ్రీశైలం, ఏవో సామ్రాట్రెడ్డి ఆకస్మికంగా తనిఖీలు చేశారు. విత్తనాల నిల్వ, విత్తన శుద్ధితయారీ తేదీలు, ఎమ్మార్పీ ధరలను పరిశీలించారు. దుకాణాల్లో ఉన్న స్టాక్ను, రికార్డులను పరిశీలించారు. వ్యాపారులు రైతులకు నాణ్యమైన విత్తనాలను విక్రయించాలన్నారు.