తాండూరులోని ఎంసీఆర్ సెంటర్లో 150 బెడ్ల ఆక్సిజన్ పడకలకు ప్రభుత్వం మంజూరు
వికారాబాద్, మే 3, (నమస్తే తెలంగాణ) : కరోనా కట్టడికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. ఐసీఎంఆర్ అనుమతితో వికారాబాద్ జిల్లాకు ఆర్టీపీసీఆర్ కేంద్రానికి రూ.16లక్షలు మంజూరు చేయడంతో ఏరియా దవాఖానలో నిర్మాణం చేయనున్నారు. మైక్రోబయోలజిస్టు, వైరాలజిస్టు, టెక్నిషియన్లు రానున్నారు. పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ పౌసుమి బసు ఆదేశించారు. డ్రైరన్ నిర్వహించి ఈనెల 7వ తేదీ వరకల్లా అందుబాటులోకి తీసుకురానున్నారు. 8వ తేదీ నుంచి టెస్టులు చేసేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది. గతంలోనే మూడు నుంచి ఐదు రోజుల్లో రిజల్ట్ వచ్చేది. కానీ ఇప్పుడు ఒక్క రోజులోనే ఫలితం రానున్నది.
జిల్లా కేంద్రంలో ఇన్నాళ్లు స్వాబ్ తీసి హైదరాబాద్ ఐసీఎంఆర్ సెంటర్లకు పంపించే వారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపింది. విద్యా శాఖ మంత్రి పట్లోళ్ల సబితారెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు ఇక్కడ ఆర్టీపీసీఆర్ సెంటర్ ఏర్పాటు చేయాలని పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు ఇటీవల ఐసీఎంఆర్ అనుమతులు వచ్చాయి. ఈ సెంటర్కు మైక్రోబయోలజిస్టు, వైరాలజిస్టు, టెక్నిషియన్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించనున్నది. ఈ సెంటర్కు రోజుకు 200 నుంచి 300 మందికి పరీక్షలు చేసే సామర్థ్యం ఉందని అధికారులు చెబుతున్నారు. ఆర్టీపీసీఆర్ సెంటర్ పనులను వేగవంతం చేసి ఈనెల 7వ తేదీ వరకు ప్రారంభించేలా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని వికారాబాద్, తాండూరు, కొడంగల్, పరిగి నియోజకవర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూరనున్నది.
జిల్లాలో పెరుగుతున్న ఆక్సిజన్ పడకలు
వికారాబాద్ ఏరియా దవాఖానలో ఏర్పాటు చేస్తున్న ఐసోలేషన్ గదులు, ఐసీయూ సెంటర్లు పెరిగాయి. అనంతగిరిలోని టీబీ దవాఖానలో 40 పడకల ఐసోలేషన్ వార్డుతో పాటుగా అన్ని పడకలకు ఆక్సిజన్ ఏర్పాట్లు చేయాలన్నారు. 20 బెడ్స్ పురుషులకు, 20 బెడ్స్ మహిళలకు కేటాయించారు. వీటితో పాటుగా తాండూరులోని ఎంసీఆర్ సెంటర్లో సైతం 150 బెడ్ల ఆక్సిజన్ పడకలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇప్పటికే తాండూరు జిల్లా దవాఖానలో 14 బెడ్లతో ఆక్సిజన్ పడకలను సిద్ధం చేశారు. ఇక్కడ ఆక్సిజన్ పడకల కోసం డ్రైరన్ సైతం పూర్తి చేశారు.
ల్యాబ్ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్..
వికారాబాద్ పట్టణంలోని ఏరియా దవాఖానలో ఆర్టీపీసీఆర్ ల్యాబ్ ఏర్పాట్లను కలెక్టర్ పౌసుమి బసు పరిశీలించారు. స్త్రీ, పురుషులకు వేర్వేరుగా ఐసోలేషన్ గదులు, నీటి, విద్యుత్ తదితర సదుపాయాలను ఎలా చేస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. పనులను త్వరగా పూర్తి చేయాలని వైద్య అధికారులను ఆదేశించారు. అనంతరం అనంతగిరిలోని టీబీ దవాఖానలో 40 పడకల ఐసోలేషన్ వార్డును పరిశీలించారు. ఇందులో ఇంటర్నెట్ సదుపాయంతో పాటు డాక్టర్లు, నర్సులు, హౌస్ కీపింగ్ సిబ్బంది మూడు షిప్టుల్లో పని చేయాలన్నారు. కలెక్టర్ వెంట జిల్లా వైద్యాధికారి సుధాకర్షిండే, డాక్టర్ రమ్యశ్రీ, డాక్టర్ లలిత, టీఎస్ఎంఎస్ఐడీసీ డీఈ రవీందర్ ఉన్నారు.