వికారాబాద్, మే 3, (నమస్తే తెలంగాణ): వికారాబాద్ జిల్లాలో సోమవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. జిల్లా కేంద్రంలో ఈదురు గాలులకు తోపుడు బండ్లు, విద్యుత్ తీగలు, భారీ వృక్షాలు నేలకొరిగాయి. మామిడి కాయలు రాలడంతో రైతులకు తీవ్ర నష్టం కలిగింది. ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడింది. ఉదయం నుంచి ఎండ దంచికొట్టింది. మధ్యాహ్నం సమయంలో వాతావరణంలో ఒక్కసారిగా చల్లబడింది. వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని ధన్నారం శ్మశాన వాటిక సమీపంలో భారీ ఈదురు గాలులకు రోడ్డుకు అడ్డంగా విద్యుత్ స్తంభం పడడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జిన్నారం-మైలార్ దేవరంపల్లి మధ్యలో రోడ్డుకు అడ్డంగా భారీ వృక్షం నేలకొరిగింది. వికారాబాద్లోని రిక్షా కాలనీలో రెండు ఇండ్లు ధ్వంసమయ్యాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ పరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడి, వర్షం కురియడంతో జిల్లా ప్రజలు ఉక్కపోత నుంచి ఉపశమనం పొందారు. వికారాబాద్ పట్టణంలో 30 నిమిషాల పాటు ఈదురు గాలులతో కురిసిన వర్షం అతలాకుతలం చేసింది. పరిగి నియోజకవర్గంలో సైతం ఈదురు గాలులతో వర్షం పడింది. తాండూరు నియోజకవర్గంలోని పెద్ద్దేముల్ మండలంలో చిరు జల్లులు కురిశాయి. కొడంగల్ నియోజకవర్గంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా 50.5 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
అధికారులు అలర్ట్గా ఉండాలి : ఎంపీ రంజిత్రెడ్డి
వికారాబాద్ జిల్లాలో వడగండ్లతో కూడిన వర్షం పడడంతో అధికారులంతా అలర్ట్గా ఉండాలని చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ గడ్డం రంజిత్రెడ్డి ఆదేశించారు. కలెక్టర్ పౌసుమి బసుకు ఫోన్ చేసి తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. పట్టణంలోని 32, 34 వార్డుల పరిధిలో భారీ వృక్షాలు, విద్యుత్ తీగలు, స్తంభాలు నేలకొరిగినట్లు గుర్తించినట్లు చెప్పారు. ఈ ఘటన జరిగిన వెంటనే కౌన్సిలర్లు, చైర్మన్ అప్రమత్తమయ్యారని స్థానికులు పేర్కొన్నారు. మరోవైపు ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం వాయుగుండంగా మారిందని, ఇది తుఫాన్గా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ తుఫాన్ మే 18 నుంచి 20వ తేదీలోపు పశ్చిమ బెంగాల్ తీరం వైపు ప్రయాణించే అవకాశం ఉందని ఇది వరకే వాతావరణ శాఖ ఉన్నతాధికారులు వెల్లడించిన విషయం విదితమే. ఈ ఘటనపై చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు రంజిత్రెడ్డి వెంటనే స్పందించి కలెక్టర్ పౌసుమి బసుతో ఫోన్లో మాట్లాడి భారీ వర్షం నేపథ్యంలో స్థానికులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ని కోరారు. రాబోయే రోజుల్లో కూడా భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉందని, అందుకు అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సమస్యలపై అధికారులు దృష్టి సారించే విధంగా చర్యలు చేపట్టాలని ఎంపీ ఆదేశించారు. మున్సిపల్ సిబ్బంది, అధికారులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. కాగా.. ఎంపీ రంజిత్రెడ్డి అభ్యర్థనపై కలెక్టర్ సానుకూలంగా స్పదించారు.