కొడంగల్, జూన్ 1: రైతు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం సేకరిస్తున్నదని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య తెలిపారు. మంగళవారం స్థానిక మార్కెట్ యార్డ్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి, వారి సమస్యలు తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందుల కలుగకుండా పంట కొనుగోళ్లను చేపట్టేలా చర్యలు తీసుకోవాలని మార్కెట్ సిబ్బందిని ఆదేశించారు. వర్షాలు కురుస్తున్నాయని, వీలైనంత త్వరగా పంట కొనుగోళ్లు చేపట్టాలని రైతులు అదనపు కలెక్టర్ను కోరారు. కేంద్రాల్లో ఖరారు చేసిన హమాలీ డబ్బులకంటే అదనంగా వసూలు చేస్తున్నారని, తద్వారా నష్టపోవాల్సి వస్తుందని రైతులు తెలిపారు.
సేకరించిన ధాన్యాన్ని కరీంనగర్కు పంపిస్తే లారీ ఖాళీ కావడానికి 4 రోజులు పడుతున్నదని, క్వింటాలుకు 4 కేజీల తరుగు నమోదు చేస్తున్నారని రైస్ మిల్లర్లు అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. అదనపు కలెక్టర్ స్పందించి వివరాలు అందించాలని, ప్రభుత్వం ఆధ్వర్యంలో చర్యలు తీసుకునేలా కృషి చేస్తానని హమీ ఇచ్చారు. మండలంలోని అంగడిరైచూర్, సంగాయిపల్లి, లక్ష్మీపల్లి గ్రామాల్లో వైకుంఠధామం, కంపోస్టు షెడ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఎప్పుడో పూర్తి కావాల్సిన అభివృద్ధి పనులు ఇప్పటికీ కొనసాగుతుండటంపై మండిపడ్డారు. నెల రోజుల్లో పనులు పూర్తి చేయించాలని పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్లను ఆదేశించారు.కార్యక్రమంలో జిల్లా సివిల్ సైప్లె అధికారి విమల, ఎంపీడీవో మోహన్లాల్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ భీములుతో పాటు టీటీ రాములు, రైతులు పాల్గొన్నారు.