మంచాల, ఏప్రిల్ 1: మత్స్య కార్మికులకు సర్వధామంగా ధర్మాయ చెరువు మారింది. ఏడాది పొడవునా ఈ చెరువులో చేపలు పట్టుకుని ఎన్నో మత్స్యకారుల కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. ధర్మాయ చెరువు చేపలకు గిరిజన తండాల్లో భలే క్రేజీ ఉంది. మంచాల మండలం ఆంబోతు తండా గ్రామ సమీపంలోని ఎత్తైన కొండపై ఉన్న ధర్మాయ చెరువు ఎప్పుడూ నీటితో కళకళలాడుతుంది. తాతముత్తాతల కాలం నాటి నుంచి ఎన్నడూ ఈ చెరువు ఎండిపోయిన దాఖలాలు లేవని ఈ ప్రాంతవాసులు చెబుతుంటారు. కరువు కాటకాలు ఏర్పడప్పుడు గిరిజన తండాలకు చెందిన వారూ తాగునీటిగా ఉపయోగించుకుంటారు. మూగజీవాలకూ ఈ నీటినే తాగిస్తారు.
ధర్మాయ చెరువు ప్రత్యేకత
ఎత్తైన కొండపై ఉన్న ధర్మాయ చెరువుకు ఎంతో విశిష్టత ఉంది. ఈ ప్రాంతంలో వృథాగా పోతున్న నీటిని ఒడిసిపట్టేందుకు వందల ఏండ్ల క్రితం రాతి కట్టడాలు నిర్మించారు. ఆనాటి నుంచి నేటి వరకు చెక్కు చెదరకుండా కట్ట ఉండడంతో చుక్కనీరు కూడా వృథాగా పోయేదికాదు. చెరువు పూర్తిస్థాయిలో నిండిన తరువాత తూము నుంచి అలుగుపోయడంతో లోయపల్లిలోని కొన్ని కాలనీలు నీట మునుగుతాయి. ధర్మాయ చెరువుకున్న విశిష్టత నాటి నుంచి నేటి వరకు కథలు కథలుగా చెప్పుకుంటారు. ధర్మాయ చెరువు వద్ద వేంకటేశ్వరస్వామి, ఆంజనేయస్వామి దేవాలయాలున్నాయి. ఈ దేవాలయాలు ఇక్కడ ఉండడంతోనే ఈ చెరువు ఏనాడు కూడా ఎండిపోదని స్థానికులు నమ్ముతారు. ప్రతియేటా ఈ ప్రాంతంలోని గిరిజనులు ధర్మాయ చెరువు వద్ద వారంరోజుల పాటు జాతర నిర్వహిస్తుంటారు.
మత్సాకారులకు ఉపాధి
ధర్మాయ చెరువు ఏడాది పొడవునా నీటితో కళకళలాడుతుంది. ఆంబోతుతండా, లోయపల్లి గ్రామాలకు చెందిన ముదిరాజులు చెరువులో చేపలు పెంచేందుకు సొసైటీని ఏర్పాటు చేసుకున్నారు. సొసైటీ నుంచి వచ్చే ఆదాయంతో సంఘాన్ని అభివృద్ధి చేస్తున్నారు. దీంతోపాటు వారు ఆర్థిక చేయూతను పొందుతున్నారు. ధర్మాయ చెరువులో ఏడాది పొడువునా చేపలు పెంచేందుకు సొసైటీ ద్వారా టెండర్ వేస్తారు. ధర్మాయ చెరువులో చేపలు పెంచి, వాటిని అమ్ముకునేందుకు ఏడాదికి సుమారు నలభై నుంచి డెభ్బైవేల రూపాయల చొప్పున టెండర్లు వేస్తారు. ఈ చెరువులో సుమారు కిలోన్నర నుంచి రెండున్నర కిలోల వరకు చేప పెరుగడంతో మార్కెట్లో కిలోకు రూ.250 నుంచి రూ.300 వరకు విక్రయిస్తారు. ధర్మాయ చెరువులో ఆదివారం ఉదయం చేపలు పడుతున్నారని తెలిస్తే చాలు చుట్టుపక్కల ప్రజలు మార్కెట్కు చేపలు తరలించకముందే అక్కడే కొనుగోలు చేసేందుకు పెద్ద ఎత్తున ఆసక్తి కనబరుస్తారు. ధర్మాయ చెరువులోని చేపలు భలే రుచిగా ఉంటాయని, ఈ చెరువులోకి కలుషితం కాని నీరు ప్రవహిస్తాయని, ఎత్తైన కొండపై ఉండడంతో ఈ చేపలు రుచిగా ఉంటాయని చాలామంది కొంటుంటారు. ఆదివారం లోయపల్లిలో సంత కావడంతో ఈ చేపలు కొనుగోలు చేసేందుకు చాలామంది చెరువు వద్దకు లేదా సంతకు వెళ్తుంటారు.
చేపలకు మంచి గిరాకీ
ధర్మాయ చెరువులోని చేపలను తినేందుకు చాలామంది ఎంతో మక్కువ చూపుతారు. ప్రతి ఆదివారం ఈ చెరువులో ఉన్న చేపలను పట్టుకుని వచ్చి సంతలో విక్రయించేందుకు వచ్చేమందే చాలామంది మధ్యలోనే కొనుగోలు చేస్తారు. ఈ చేపలకోసం చాలా దూరం నుంచి వస్తుంటారు. దీంతో మార్కెట్లో ధర్మాయ చెరువు చేపలకు మంచి డిమాండ్ ఉంటుంది.
– ఆంగోతు ప్రవీణ్, మంచాల
ఏడాది పొడవునా నీళ్లే..
సంవత్సరం పొడవునా ధర్మాయ చెరువులో నీరు పుష్కలంగా ఉంటాయి. ఈ చెరువు కింద ఎంతోమంది మత్స్యకారులు చేపలు పట్టుకుని జీవిస్తున్నారు. ఏడాది పొడవునా చెరువు ఎండిపోదు. గుట్టల మధ్య ఉన్న ఈ చెరువులోని చేపలకు మంచి గిరాకీ ఉంటుంది. దీనికి తోడుగా టీఆర్ఎస్ ప్రభుత్వం మత్స్యకారులకు ఉచితంగా చేపపిల్లలు అందజేసి ఆదుకోవడం సంతోషకరం -సేవ్యానాయక్, మంచాల
ఇవీ కూడా చదవండీ..
కరోనా కలకలం.. ఐఐటీ జోధ్పూర్ లో 25 మందికి పాజిటివ్
దేశభక్తి చాటుకున్న సీఎం మమత