పరిగి : క్రీడలతో ఉన్నత శిఖరాలకు ఎదగవచ్చని, చక్కటి గుర్తింపు లభిస్తుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా పరిగిలోని ఇండోర్ స్టేడియంలో ఆదివారం యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహేశ్రెడ్డి మాట్లాడుతూ చిన్నప్పటి నుంచే క్రీడల్లో పాలుపంచుకోవడంతో ఉన్నత శిఖరాలకు అదిరోహించవచ్చని అన్నారు. అంతర్జాతీయ, జాతీయ స్థాయికి ఎదిగిన క్రీడాకారులకు చక్కటి గుర్తింపు రావడంతో పాటు ఉద్యోగావకాశాలు లభిస్తాయని ఎమ్మెల్యే తెలిపారు. ఇటీవల జరిగిన ఒలంపిక్స్లో పలు రంగాల్లో పతకాలు సాధించిన అనేక మంది దేశంతో పాటు తమ ప్రాంతానికి చక్కటి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చారన్నారు.
దేశం గర్వించదగిన వారిని ఆదర్శంగా తీసుకొని, అంత ఎత్తుకు ఎదుగాలని ఎమ్మెల్యే సూచించారు. క్రీడలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ధ్యాన్చంద్ హాకీలో ఒంటిచేతితో అనేక వేదికలపై భారత జట్టును గెలిపించారని ఎమ్మెల్యే గుర్తు చేశారు. ఈ సందర్భంగా మేజర్ ధ్యాన్చంద్ చిత్రపటానికి ఎమ్మెల్యే మహేశ్రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి హన్మంత్రావు, మార్కెట్ చైర్మన్ సురేందర్, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, జడ్పీటీసీ హరిప్రియ, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు ఆంజనేయులు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ప్రవీణ్కుమార్రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ ఎస్. భాస్కర్, క్రీడాకారులు పాల్గొన్నారు.