వికారాబాద్: జిల్లాలోని మర్పల్లి మండలం తిమ్మాపూర్ వాగులో కొట్టుకుపోయిన పెళ్లిబృందం కారు లభించింది. అందులో మూడు మృతదేహాలు లభమయ్యాయి. కారులో మొత్తం ఆరుగురు ప్రయాణిస్తుండగా.. వరుడు నవాజ్ రెడ్డి, ఆయన అక్క శ్వేత మాత్రమే క్షేమంగా బయటపడ్డారు. వాగులో గల్లంతైనవారికోసం గాలిస్తుండగా వధువు ప్రవల్లిక, వరుడి అక్క రాధమ్మ, డ్రైవర్ రాఘవేందర్ రెడ్డి మృతదేహాలు లభించాయి. కాగా, కనిపించకుండా పోయిన ఇషాంత్ రెడ్డి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
ఈ నెల 26న రావులపల్లికి చెందిన నవాజ్రెడ్డికి మోమిన్ పేటకు చెందిన ప్రవల్లికతో వివాహం జరిగింది. మోమిన్పేటకు వెళ్లి వస్తుండగా ఆదివారం రాత్రి తిమ్మాపూర్ వాగులో కారు కొట్టుకుపోయింది. రోడ్డుపై నీరు పారుతుండగా వద్దని వారించినా వినకుండా వాగుదాటుతుండగా ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు పేర్కొన్నారు.