దేవరుప్పుల, మే 2 : మానవాళికి ముప్పుగా పరిణమించిన కరోనా వైరస్ కట్టడికి ప్రజలు స్వచ్ఛందంగా లాక్డౌన్ పాటిస్తున్నారు. మండల కేంద్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో గ్రామపంచాయతీ పాలకవర్గం స్థానికుల సూచనల మేరకు లాక్డౌన్ విధించింది. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు మాత్రమే షాపులు తెరవాలని పంచాయతీ పాలకవర్గం ఆదేశించింది. దీంతో ఆదివారం నుంచి ప్రజలు ఇం దుకనుగుణంగా తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. మండల కేంద్రంలో పీహెచ్సీ ఉండడంతో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రతి శనివారం అంగడి కొనసాగుతుండడంతో వివిధ అవసరాల కోసం ప్రజలు మండల కేంద్రానికి వస్తున్నారు. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నందున లాక్డౌన్ విధించినట్లు సర్పంచ్ ఈదునూరి రమాదేవి తెలిపారు. కరోనా నిబంధనలు అతిక్రమిస్తే జరిమానా విధిస్తామన్నారు.
లింగాలఘనపురంలో కరోనా పరీక్షలు..
లింగాలఘనపురం : మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆదివారం 18 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా వీరిలో 17 మందికి పాజిటివ్ వచ్చిందని మండల వైద్యాధికారి కరుణాకర్రాజు తెలిపారు. బాధితులకు మందులు అందజేసి హోం క్వారంటైన్లో ఉండాలని సూచించామన్నారు. కరోనా వైరస్ విస్తరిస్తున్నందున ప్రజలంతా జాగ్రత్తలు పాటించాలని కోరారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించి ఇళ్లకే పరిమితం కావాలని ఆ యన సూచించారు. స్వీయ నియంత్రణ పాటిస్తే మేలని పేర్కొన్నారు.
కరోనాపై అప్రమత్తంగా ఉండాలి
బచ్చన్నపేట : కరోనాపై ప్రజలు అప్రమత్తం గా ఉండాలని మండల వైద్యాధికారి కర్రె నవీన్కుమార్ సూచించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ ప్రమాదకరంగా మారిందన్నారు. ప్రజలు ఇంటి పట్టునే ఉండి పౌష్టికాహారం తీసుకోవాలని, తరచూ వేడి నీళ్లు తాగాలన్నారు. తప్పని పరిస్థితుల్లో బయ టకు వెళ్తే మాస్కులు ధరించాలని ఆయన కోరారు. ఎప్ప టికప్పుడు శానిటైజర్ వినియోగించడంతోపాటు భౌతికదూరం పాటించాలని నవీన్కుమార్ సూచించారు.