వికారాబాద్ : మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వికారాబాద్ కలెక్టర్ పౌసుమిబసు తెలిపారు. బుధవారం వికారాబాద్ మండల పరిధిలోని పాతూరు గ్రామ పంచాయతీలోని ప్రధాన రోడ్డుకు ఇరువైపుల మొక్కలు నాటేందుకు తీసిన గుంతలను పరిశీలించి, మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రధాన రోడ్డు నుంచి గ్రామం వరకు రోడ్డుకు ఇరువైపుల రెండు నుంచి మూడు లైన్లు మొక్కలు నాటేలా గుంతలు తీయాలన్నారు.
వ్యవసాయపనులు చేసుకునే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించుకునే బాధ్యతలు తీసుకోవాలని సూచించారు. పచ్చని చెట్లతో స్వచ్ఛమైన వాతావరణం ఏర్పడుతుందని వివరించారు. తీసిన గుంతల్లో పెద్దగా ఉన్న మొక్కలను నాటాలన్నారు. పూల మొక్కలు, పండ్ల మొక్కలు సైతం నాటేందుకు కృషి చేయాలన్నారు. ప్రతి మొక్కను సంరక్షించుకునే బాధ్యత కూడా తీసుకోవాలని వివరించారు. కార్యక్రమంలో డీఎల్పీవో అనీత, ఎంపీడీవో సుభాషిణి, ఆర్అండ్బీ ఏఈ, సర్పంచ్, ఏపీవో శ్రీనివాస్, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు.