బొంరాస్పేట : రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మండలంలోని ఏర్పుమళ్ల గ్రామానికి సమీపంలో ఉన్న కాకరవాణి ప్రాజెక్టు నిండి అలుగు పారుతుంది. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టు నిండు కుండలా మారింది. రెండు సంవత్సరాల నుంచి వరుసగా కాకరవాణి ప్రాజెక్టు అలుగు పారుతుంది. ప్రాజెక్టు కింద 600ఎకరాల ఆయకట్టు కింద పంట పొలాలు ఉన్నాయి. ప్రాజెక్టు పూర్తిగా నిండడంతో ఆయకట్టు కింది రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ప్రాజెక్టు వద్దకు చేరుకుని అలుగు పారే దృశ్యాలను తిలకిస్తున్నారు.
ఇదిలా ఉండగా భారీ వర్షాల వల్ల బొంరాస్పేట, మెట్లకుంట చెరువుల్లోకి కూడా వరద నీరు వచ్చి చేరుతుంది. కాకరవాణి ప్రాజెక్టు అలుగు ద్వారా వచ్చే వరద నీరు ఏటి కాలువ ద్వారా బొంరాస్పేట పెద్ద చెరువులోకి వస్తుంది. వర్షాలు ఇలాగే కురిస్తే బొంరాస్పేట, మెట్లకుంట చెరువులు కూడా నిండే అవకాశం ఉందని రైతులు భావిస్తున్నారు.