వికారాబాద్ : అనంతగిరి రైతు ఉత్పత్తి దారుల కేంద్రంలో కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటుతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని కలెక్టర్ పౌసుమి బసు అన్నారు. బుధవారం మోమిన్పేట మండల కేంద్రంలోని అనంతగిరి రైతు ఉత్పత్తి దారుల కంపెనీకి అవసరమైన విషయాలపై కోల్డ్ స్టోరేజ్ సొల్యూషన్ సంస్థ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కంపెనీ ప్రతి నిధులతో కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు నిర్వహణపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇప్పించి అనంతగిరి సభ్యులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కోల్డ్ స్టోరేజ్ కొసం 200 గజాల స్థలం అవసరమని దీని ఏర్పాటుకు రూ.4.5 లక్షలు ఖర్చు అవుతుందని తెలియజేశారు. కోల్డ్ స్టోరేజ్ లో రైతులు పండించిన పంటలు మూడు నుంచి నాలుగు రోజులు ఎలాంటి నష్టం లేకుండా ఉంచుకొని అమ్ముకోవచ్చని తెలిపారు.
ఈ స్టోరేజ్ కు 8 గంటల విద్యుత్ ఖర్చు అవుతుందని మిగతా సమయంలో బ్యాటరీతో నడుస్తుందని, విద్యుత్ ఖర్చు కూడా చాలా తక్కువ ఉంటుందని అన్నారు. రైతు ఉత్పత్తి దారుల కంపెనీ పరిసర ల్థంలో ఈ స్టోరేజ్ ను ఏర్పాటు చేసేందుకు స్థలం కేటాయించినట్లు తెలిపారు.