కొడంగల్ : కరోనా కారణంగా నష్టపోయిన వీధి వ్యాపారస్తులను ఆదుకునే ఉద్ధేశంతో ప్రభుత్వం పీఎం స్వానిధి రుణాలను అందిస్తుందన్నారు. దానిని వీధి వ్యాపారులు సద్వినియోగం చేసుకొని ఆర్థిక లాభాలు ఆర్జించాలని జిల్లా మెప్మా పీడీ రవికుమార్ తెలిపారు. ఆదివారం స్థానిక ఎస్బీఐ బ్యాంకులో వీధి వ్యాపారస్తుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం స్వానిధి పథకం ద్వారా చిరు వ్యాపారస్తులను వడ్డీ లేకుండా రుణాలను అందిస్తుందని, అందించిన మొత్తం రుణాన్ని సకాలంలో తిరిగి చెల్లిస్తే ఎక్కువ మొత్తంలో రుణాన్ని అందుకునే సదుపాయం ఉన్నట్లు తెలిపారు.
పీఎం స్వానిధి పథకం దేశంలో తెలంగాణ రాష్ట్ర మొదటి స్థానంలో, రాష్ట్రంలో వికారాబాద్ జిల్లా నాల్గవ స్థానంలో ఉన్నట్లు పేర్కొన్నారు. కొడంగల్ పరిధిలో మొత్తం 697మంది వీధి వ్యాపారస్తులను గుర్తించడం జరిగిందని, ఇందులో ఇప్పటి వరకు 518మందికి రుణాలను అందించాన్నారు. కాగా మిగిలిన వారిలో ఆదివారం 44 మందికి రుణాలను అందించినట్లు తెలిపారు. మిగతా వారికి ఈనెల 15వ తేదీ లోపు పూర్తి స్థాయిలో రుణాలను అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. అదే విధంగా బ్యాంకు మేనేజరు రాంబాబు మాట్లాడుతూ వీధి వ్యాపారస్తులు అందరూ తప్పకుండా పీఎం జేబీవై ఇన్సూరెన్స్ పాలసీ చేసుకోవాలని తెలిపారు. అదే విధంగా ఎస్బీఐ మేనేజరు కిరణ్కుమార్ మాట్లాడుతూ బ్యాంకు నందు దరఖాస్తు చేసుకున్న అందరికీ రుణాలను మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ఈ సదవకాశాన్ని సద్వినియోగం అందరూ చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో బ్యాంకు సిబ్బంది వీధి వ్యాపారస్తులు పాల్గొన్నారు.