వికారాబాద్ : కరోనా ప్రభావంతో చాలా రోజులుగా విద్యా సంస్థలు మూసి ఉన్నాయి. కరోనా తీవ్రత తగ్గడంతో రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 1, బుధవారం నుంచి విద్యా సంస్థలు తెరిచేందుకు అనుమతులు ఇచ్చింది. దీంతో వికారాబాద్లోని పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాల తెరుచుకోవడంతో విద్యార్థులు హాజరయ్యారు. విద్యాశాఖ ఆదేశాల మేరకు ఇప్పటికే పాఠశాలల పరిశుభ్రతతో పాటు శానిటైజేషన్ పనులు పూర్తి చేశారు. వికారాబాద్లోని గంగారం ప్రాథమిక పాఠశాలతో పాటు, మరికొన్ని పాఠశాలలకు కొత్త రంగులు వేసి అందంగా ముస్తాబు చేశారు. పాఠశాలలకు విద్యార్థులు సకాలంలో హాజరై ప్రార్థనలు చేశారు.
జడ్పీహెచ్ఎస్ బాల, బాలికల పాఠశాలతో పాటు మండల పరిధిలోని మైలార్దేవర్పల్లి పాఠశాలలను జిల్లా విద్యాధికారి రేణుకాదేవి సందర్శించారు. విద్యార్థులకు తరగతులు ప్రారంభించడంతో పాటు మధ్యాహ్న భోజనం, తాగునీటి సౌకర్యాలు కల్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు. వికారాబాద్ మండల విద్యాధికారి కార్యాలయంలో ఆయా పాఠశాలలకు చెందిన విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, శానిటైజర్లను ఎంఈవో బాబుసింగ్ పంపిణీ చేశారు.