ధారూరు, జూలై 30: ఊరూవాడ సల్లంగా ఉండేలా సూడు తల్లి అంటూ గ్రామ దేవత పోచమ్మ తల్లికి శుక్రవారం ధారూరు గ్రామస్తులు బోనాలు సమర్పించారు. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని గ్రామంలోని మహిళలు, చిన్నారులు, యువకులు, పెద్దలు, పోచమ్మ తల్లికి ఘనంగా బోనాలు తీశారు. బోనాలను అలంకరించి గ్రామంలో ప్రధాన వీధుల గుండా బాజభజంత్రీలు, పోతరాజుల విన్యాసాలు, ఆటపాటలతో ఊరేగింపుగా తీసుకెళ్లారు. కార్యక్రమంలో సర్పంచ్ చంద్రమౌళి, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
పెద్దేముల్లో
పెద్దేముల్, జులై 30: ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండడంతో పాటు, పాడి పంటలు సమృద్ధిగా పండేలా బోనాలు నిర్వహిస్తున్నామని రేగొండి, మంబాపూర్ సర్పంచ్లు హైదర్, శ్రవణ్ కుమార్ తెలిపారు. శుక్రవారం మంగళవాయిద్యాల నడుమ మహిళలు ఉరేగింపుగా వెళ్లి భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించారు. తెలంగాణా సంస్కృతీ సంప్రదాయాలకు బోనాలు అద్దం పడుతాయన్నారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.
కులకచర్లలో..
కులకచర్ల, జూలై 30: మండలంలోని ఆయా గ్రామాల్లో శుక్రవారం పోచమ్మ తల్లి బోనాలు ఘనంగా నిర్వహించారు. బోనాల సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాల్లో ఉన్న పోచమ్మతల్లి దేవాలయాలను అందం గా అలంకరించారు. మండలంలోని అంతారం, రాం పూర్, ఇప్పాయిపల్లి, తిర్మలాపూర్, చౌడాపూర్తో పాటు ఇతర గ్రామాల్లో అమ్మవారికి బోనాలు సమర్పించారు.
పరిగిలో..
పరిగి, జూలై 30: మండలంలోని రంగంపల్లి గ్రామంలో శుక్రవారం పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం పోచమ్మ ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కె.సత్యనారాయణ, సర్పంచ్ లక్ష్మీదేవి, గ్రామస్తులు పాల్గొన్నారు.
బంట్వారంలో..
బంట్వారం, జులై 30: మండలంలోని సరిహద్దు గ్రామం కుంచవరంలో శుక్రవారం బోనాలను ఘనంగా జరుపుకొన్నారు. ఊరడమ్మ దేవతకు నైవేద్యాలు సమర్పించారు. గ్రామాన్ని చల్లంగా చూడాలని పంచాయతీ అధ్యక్షురాలు సుజాత రమేశ్, ఇతర వార్డు సభ్యులు, గ్రామస్తులు మొక్కులు మొక్కుకున్నారు.
బొంరాస్పేటలో ..
బొంరాస్పేట, జూలై 30: మండలంలోని బొంరాస్పేట, దుద్యాల, తుంకిమెట్ల, మెట్లకుంట గ్రామాల్లో శుక్రవారం బోనాల పండుగను ఘనంగా జరుపుకొన్నారు. మహిళలు బోనాలతో ఊరేగింపుగా దేవాలయాలకు వెళ్లి పోచమ్మ, దుర్గామాత, ఊరడమ్మ, బోనమ్మ దేవతలకు నైవేద్యం సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు. దుద్యాలలో బోనాల ఊరేగింపులో ఒగ్గుడోలు కళాకారుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి.