పరిగి, ఏప్రిల్ 29: ప్రభుత్వం అందిస్తున్న ఉచిత శిక్షణను నిరుద్యోగ యువత సద్వినియో గం చేసుకొని ఉద్యోగాలు సాధించాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల సూచించారు. శుక్రవారం వికారాబాద్ శ్రీఅనంత పద్మనాభ కళాశాలలో ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణ శిబిరాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం చరిత్రలోనే ఎప్పుడూలేని విధంగా వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటు న్నదన్నారు. ప్రభుత్వం వివిధ గ్రూపులకు సంబంధించిన నోటిఫికేషన్లను జారీ చేస్తున్న నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ యువతకు ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు శాఖల పరంగా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ఉద్యోగాల సాధనే లక్ష్యంగా పట్టుదలతో చదువాలని కలెక్టర్ సూచించారు.
ప్రతి కుటుంబంలో వ్యక్తిగత ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని పక్కన పెట్టి ఉద్యోగం సాధించడమే లక్ష్యం గా శ్రమించాలన్నారు. శిక్షణ ఇచ్చే రెండు నెలలపాటు భోజన వసతి కల్పించడం జరుగుతుందని, దూర ప్రాంతాల నుంచి వచ్చే యువతీయువకుల విజ్ఞప్తి మేరకు అధికారులతో మాట్లాడి వసతి సదుపాయం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చెప్పారు. శిక్షణ పొందుతున్న వారికి స్టడీ మెటీరియల్ అందించడం జరుగుతుందని, ఏమైనా సబ్జెక్టులకు సంబంధించి మెటీరియల్ కావాల్సి వస్తే అధికారుల దృష్టికి తీసుకురావాలని, అదనంగా సమకూరుస్తామని తెలిపారు. శిక్షణ శిబిరంలో అత్యధిక సంఖ్యలో యువతులు ఉండటంపై కలెక్టర్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మోతీలాల్, జిల్లాల షెడ్యూల్డ్ కులా అభివృద్ధి అధికారి మల్లేశం, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కోటాజీ, ఎస్ఏపీ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ సోమన్న, అధ్యాపకుడు నారాయణరావు, ఉద్యోగార్థులు పాల్గొన్నారు.