చేవెళ్ల టౌన్, సెప్టెంబర్ 26 : భావి తరాలకు ఆదర్శప్రాయురాలు చాకలి ఐలమ్మ అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి అన్నారు. చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకొని చేవెళ్ల మండల కేంద్రంలో ఆమె విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య పాల్గొని ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి సబితారెడ్డి మట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యమకారులను ముఖ్యమంత్రి కేసీఆర్ గౌరవిస్తున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ బస్వరాజ్ సారయ్యకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించి సముచిత న్యాయం చేశారన్నారు. కుల వృత్తులు, సబ్బండ వర్ణాల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. రూ.10 నుంచి 15 లక్షల వరకు మోడ్రన్ లాండ్రిలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. చేవెళ్లలో రజక భవనం ఏర్పాటు చేసుకునేందుకు స్థలానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. యావత్ మహిళా లోకానికి ఐలమ్మ జీవితం స్ఫూర్తి దాయకమని, ఆమె తెగువ మహిళా చైతన్యానికి ప్రతీక అన్నారు.
ఆమె పోరాటానికి నిజమైన నివాళి..
ఐలమ్మ జయంతి, వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం ఆమె చేసిన పోరాటానికి నిజమైన నివాళి అన్నారు. తెలంగాణ మట్టిలోనే పోరాటముందని, అందుకు చాకలి ఐలమ్మ జీవితం గొప్ప సందేశమిస్తున్నదన్నారు.
రజకులకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్..
ప్రభుత్వం రజకులకు 250 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ ఇస్తోందని, దోభీ ఘాట్లతో పాటు ఇండ్ల వద్ద ఇస్త్రీ దుకాణాలకు విద్యుత్ ఇస్తున్నట్లు పేర్కొన్నారు.
అందరూ గర్వపడేలా ..
అందరూ గర్వపడేలా చాకలి ఐలమ్మ వర్ధంతి, జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ పోరాట యోధులను సీఎం కేసీఆర్ గౌరవిస్తూ వారికి సముచిత స్థానాన్ని కల్పించడం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో రజక సంఘం జాతీయ అధ్యక్షుడు అంజయ్య, రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణమూర్తి, జిల్లా అధ్యక్షుడు అజయ్, ఐలమ్మ మనుమరాలు అంజలి, ఎంపీపీ విజయలక్ష్మి, జడ్పీటీసీ మాలతి, చేవెళ్ల సర్పంచ్ శైలజ, మాజీ జడ్పీటీసీ బాల్రాజ్, వైస్ ఎంపీపీ ప్రసాద్, ఎంపీటీసీలు రాములు, వసంతం, అంబేద్కర్ సంఘం నాయకులు బురాన్ ప్రభాకర్, రాజు, మల్లేశం, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పెద్దోళ్ల ప్రభాకర్, టీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షుడు శేఖర్ పాల్గొన్నారు.