కోట్పల్లి, జూలై 5 : గ్రామాలాభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య తెలిపారు. సోమవారం మండలంలోని జిన్నారం, రాంపూర్ గ్రామాల్లో ఎంపీడీవో లక్ష్మీనారాయణ, ఎంపీవో డానియెల్, ఏపీవో అంజిలయ్యలతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన జిన్నారంలో పల్లె ప్రగతి, హరితహారంలో కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు.
పరిసరాల పరిశుభ్రతే లక్ష్యం
వికారాబాద్, జూలై 5 : పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడమే పట్టణ ప్రగతి ప్రధాన లక్ష్యమని వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ చిగుళ్లపల్లి మంజుల అన్నారు. సోమవారం పట్టణ ప్రగతిలో భాగంగా 15వ వార్డు ఎన్నెపల్లిలో పార్కులోని కలుపు మొక్కలు తొలగించారు. 16వ వార్డులో డీసిల్టింగ్ పనులు చేయించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ కాలనీలను శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత కాలనీ వాసులపై ఉంటుందన్నారు. అనంతరం మున్సిపల్కు మంజూరైన మరో 2 చెత్త సేకరణ వాహనాలను మున్సిపల్ కార్యాలయంలో ప్రారంభించారు. చైర్పర్సన్ వెంట మున్సిపల్ కమిషనర్ బుచ్చయ్య, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రమేశ్కుమార్, వార్డు కౌన్సిలర్ అనంత్రెడ్డి, టీఆర్ఎస్ పట్టణ ఉపాధ్యక్షుడు వేణుగోపాల్ ఉన్నారు.
స్వచ్ఛందంగా శ్రమదానం
బంట్వారం, జూలై 5 : పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని ఎంపీడీవో బాలయ్య పిలుపునిచ్చారు. సోమవారం పల్లె ప్రగతిలో భాగంగా బస్వపూర్, తొరుమామిడి, బొపునారం, సల్బత్తాపూర్, రొంపల్లి, మాలసోమారం, సుల్తాన్పూర్ తదితర గ్రామాల్లో పంచాయతీ ప్రజాప్రతినిధులు, ప్రజలు శ్రమదానం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్లు నర్సింహులు, నర్సింహారెడ్డి, స్పూర్తి, లావణ్య పాల్గొన్నారు.
ప్రతి ఇంటికి 6 మొక్కలు
ధారూరు, జూలై 5 : మండల పరిధిలోని కొండాపూర్ కలాన్ గ్రామంలో కలుపు మొక్కలను తొలగించి, మొక్కలు నాటేందుకు గుంతలు తీశారు. అనంతరం ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ చేశారు. దోర్నాల్ గ్రామంలో నాటిన మొక్కలకు ట్రీగార్డ్లను ఏర్పాటు చేశారు. ధారూరు మండల కేంద్రంలో శ్రమదానం చేశారు. ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
పరిశుభ్రత అందరి బాధ్యత
మోమిన్పేట, జూలై 5 : గ్రామంలో పచ్చదనం పరిశుభ్రత అందరి బాధ్యత అని సర్పంచ్ సావిత్రమ్మ అన్నారు. సోమవారం రాళ్లగూడుపల్లి గ్రామంలో చెత్తాచెదారం తొలగించి శుభ్రం చేసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ తమ పరిసరాల్లో మొక్కలు నాటి వాటిని సంరక్షణ బాధ్యతలు తీసుకోవాలన్నారు. తడి, పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలని గ్రామస్తులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ రాములు, పంచాయతీ కార్యదర్శి వెంకట్రెడ్డి, నాయకులు బాలుగౌడ్, నోడల్ అధికారి, గ్రామస్తులు పాల్గొన్నారు.
పల్లె ప్రగతి పనుల పరిశీలన
కొడంగల్, జూలై 5 : మండలంలోని రుద్రాం, చిట్లపల్లి, నాగారం గ్రామాల్లో పల్లె ప్రగతి పనులను ఎంపీడీవో మోహన్లాల్, మండల ప్రత్యేకాధికారి దుర్గాప్రసాద్, ఎంపీవో శ్రీనివాస్ సోమవారం పరిశీలించారు. అనంతరం వైకుంఠధామం, కంపోస్టు షెడ్, పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలను అధికారులు సందర్శించారు.