దరఖాస్తులన్నింటికీ దశల వారీగా మోక్షం
ఆరు జిల్లాల నుంచి 26,298 అర్జీలు
ఈ ఏడాది రూ.11.65 కోట్లతో 1,265 యూనిట్లు
కసరత్తు చేస్తున్న ఐటీడీఏ అధికారులు
ఏటూరునాగారం, మే 2 :ప్రభుత్వం గిరిజనులకు భరోసానిస్తోంది. వారి వ్యక్తిగత ఆర్థిక స్వావలంబన కోసం గిరిజన సంక్షేమశాఖ ఐటీడీఏ ద్వారా అమలు చేస్తున్న ఈఎస్ఎస్(ఎకనామికల్ సపోర్టు స్కీం) అమలులో సరికొత్త మార్పులు తీసుకొచ్చింది. ఈ స్కీం కోసం వచ్చిన వేలాది దరఖాస్తులకు మోక్షం లభించేలా చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే వచ్చిన దరఖాస్తులను మొత్తం ఆన్లైన్ చేసి, వెరిఫికేషన్ అనంతరం అర్హులైన వారందరికీ దశల వారీగా లబ్ధి చేకూర్చే సరికొత్త ప్రయోగానికి గిరిజన సంక్షేమశాఖ శ్రీకారం చుట్టింది.
2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను ఈఎస్ఎస్కు గిరిజనులు చేసుకున్న దరఖాస్తులు భారీగా ఉండడంతో గిరిజన సంక్షేమశాఖ కీలక నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో ఒకసారి ఐటీడీఏలో లబ్ధికోసం దరఖాస్తు చేసుకున్న వారు తరచూ దరఖాస్తు సమర్పించాల్సిన అవసరం లేదు. పైగా చేసుకున్న దరఖాస్తు కోసం ఐటీడీఏ చుట్టూ ప్రదక్షిణలు కూడా చేయాల్సిన పని లేదు. అంతా ఆన్లైన్లోనే జరుగుతుంది. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లాకు కేటాయించిన టార్గెట్కు మించి వేల సంఖ్యలో మార్చి నెలాఖరు వరకు దరఖాస్తులు వచ్చాయి. కాగా, ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో గిరిజనుల కోసం రూ.11.65 కోట్ల సబ్సిడీతో వివిధ రకాల 1265 యూనిట్లను కేటాయించారు. జిల్లాలు, మండలాలు, గ్రామాల వారీగా వాటిని విభజించారు. కాగా, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రూ.70.27లక్షలతో 48 యూనిట్లు, ములుగు జిల్లాలో రూ.1.63 కోట్లతో 120 యూనిట్లు, మహబూబాబాద్ జిల్లాలో రూ.5.53కోట్లతో 690 యూనిట్లు, వరంగల్ అర్బన్ జిల్లాలో రూ.62.88లక్షతో 81 యూనిట్లు, వరంగల్ రూరల్ జిల్లాలో 1.98కోట్లతో 182 యూనిట్లు, జనగామ జిల్లాలో రూ.18కోట్లతో 144 యూనిట్లు టార్గెట్గా నిర్ణయించారు.
సబ్సిడీపై అనేక రకాల యూనిట్లు..
గిరిజనులు లబ్ధి పొందడానికి అనేక రకాల యూనిట్లు ఉన్నాయి. ప్రధానంగా వ్యవసాయం, ఉద్యానవనం, మత్స్యశాఖ, పశుసంవర్ధకశాఖ, నీటి పారుదల శాఖ, ఐఎస్బీ సెక్టార్ల కింద అనేక రకాల యూనిట్లు అందజేయనున్నారు. ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, బోరు బావులు, వ్యవసాయ భూములకు విద్యుత్ మోటర్లు, డీజిల్ ఇంజిన్లు, ఎడ్లబండ్లు, పాడి గేదెల పెంపకం, గొర్రెల యూనిట్లు, మినీ డెయిరీలు, పౌల్ట్రీ ఫాంలు, పాల ఉత్పత్తి కేంద్రాలు, చేపల పెంపకం, కూరగాయల పెంపకం, మినీ ట్రాక్టర్లు, మామిడి తోటల పెంపకం, తైవాన్ స్ప్రేయర్లు, స్ప్రింక్లర్లు, కిరాణం, ఫ్లెక్సీ ప్రింటింగ్, జిరాక్స్, బ్యూటీ పార్లర్, జనరల్ స్టోర్లు, జ్యూట్ మేకింగ్, టెంట్ హౌస్, డ్రిప్ ఇరిగేషన్, పైపులైన్, బోరు వెల్, బేకరీ, ఫ్యాన్సీ, హోటల్స్ తదితర సుమారు వందకు పైగా రకాల యూనిట్లు ఉన్నాయి. ఇక ఆయా యూనిట్లను అందించే క్రమంలో లబ్ధి పొందేందుకు దరఖాస్తు చేసుకున్న యూనిట్ ఆ గ్రామంలో నడుస్తుందా? లేదా? మార్కెట్లో ఎలాంటి డిమాండ్ ఉందనే విషయాన్ని పరిగణనలోకి తీసుకుని అందజేయనున్నారు.
గ్రామ సభల ద్వారా ఎంపిక..
దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను ఎంపిక చేసేందుకు గ్రామస్థాయిలో అధికారులు సభలు నిర్వహిస్తారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో ఉండే కమిటీల ద్వారా లబ్ధిదారుల ఎంపిక చేపడుతారు. తర్వాత ఐటీడీఏ నుంచి నేరుగా ట్రైకార్కు ఎంపిక జాబితాను పంపిస్తారు. ఎంపికైన లబ్ధిదారుడు తన బ్యాంకు ఖాతాను అందజేస్తే నేరుగా సబ్సిడీ సొమ్ము జమ చేస్తారు. తర్వాత గ్రౌండింగ్లో బ్యాంకు మేనేజర్, సంబంధిత శాఖ అధికారి, ఐటీడీఏ, మండల సమాఖ్య నుంచి కూడా సభ్యులు ఉంటారు.
పకడ్బందీగా లబ్ధిదారుల ఎంపిక..
ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి వచ్చిన దరఖాస్తులపై కసరత్తు చేశాం. ఆయా జిల్లాల వారీగా అధికారులు అమలు చేస్తున్నారు. ఆరు జిల్లాల నుంచి వచ్చిన 26,298 దరఖాస్తుల్లో ఈ ఆర్థిక సంవత్సరం ఇచ్చిన టార్గెట్ పోగా మిగిలిన వారికి వచ్చే ఏడాది నుంచి దశల వారీగా యూనిట్లు అందించేలా ప్లాన్ చేస్తున్నాం. ఎక్కువ మంది గిరిజనులు సబ్సిడీ పొందేలా యూనిట్లు మంజూరు చేయాలని లక్ష్యం పెట్టుకున్నాం. అర్హులకు ప్రాధాన్యతను బట్టి యూనిట్లు అందజేస్తాం. లబ్ధిదారుల ఎంపిక విధానం పకడ్బందీగా ఉండేలా ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడంతో ఐటీడీఏ పీవో తగు చర్యలు తీసుకుంటున్నారు. సంబంధిత శాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి ఎంపికకు సంబంధించి మార్గదర్శకాలను అందజేస్తామన్నారు.
– వసంతరావు, ఏపీవో, ఐటీడీఏ