పెద్దేముల్ : ప్రజలు, భక్తులు వినాయక చవితి పండుగను భక్తి భావంతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని తాండూరు డీఎస్పీ లక్ష్మీనారాయణ, రూరల్ సీఐ జలెంధర్ రెడ్డి అన్నారు. గురువారం వినాయక చవితి పండుగ నేపథ్యంలో స్థానిక పోలీసు స్టేషన్లో అన్ని మతాల పెద్దలు, వినాయక మంటపాల నిర్వహకులతో శాంతి సమావేశాన్ని నిర్వహించి పలు సూచనలు సలహాలను అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినాయక ఉత్సవాలను నిర్వహించే వారు మంటపాల ఏర్పాటులో అన్ని రకాల జాగ్రత్తలు పాటిస్తూ, పోలీసు స్టేషన్లో వివరాలను నమోదు చేసుకొంటూ, కొవిడ్ నిబంధనలు పాటిస్తూ నిర్వహించుకోవాలన్నారు.
ముఖ్యంగా మంటపాలను రోడ్డుకు అడ్డంగా ఏర్పాటు చేయరాదని, ఇతర మతాల వారికి ఇబ్బందులు కలిగించరాదని, డీజేలకు ఎలాంటి అనుమతి లేదని, మత విశ్వాసాలను రెచ్చగొట్టరాదని, సోషల్ మీడియా వదంతులు నమ్మవద్దని, భక్తితో ఉత్సవాలు జరుపుకొంటే ముక్తి లభిస్తుందన్నారు. సుప్రీం కోర్టు సూచనలను, పోలీసు వారి సూచనలు ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించాలన్నారు. మంటపాల దగ్గర కరెంట్ షాక్, లడ్డూల చోరీ విషయంలో జాగ్రత్తలు పాటిస్తూ ఎవరు కూడా మద్యం సేవించకుండా ఉత్సవాలను జరుపుకోవాలన్నారు. ఎవరైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు.
ప్రతి ఒక్కరు అనుమతులు తీసుకొని వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో తట్టేపల్లి పీఏసీఎస్ చైర్మన్ లక్ష్మారెడ్డి, మండల సర్పంచు ల సంఘం అధ్యక్షుడు బల్వంత్రెడ్డి, విద్యుత్ ఏఈ సందీప్, ఇన్చార్జి ఎస్ఐ విశ్వజన్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, మంటపాల నిర్వహకులు, వివిధ మతాల పెద్దలు, యువకులు పాల్గొన్నారు.