వికారాబాద్ : అనాథలకు ఉజ్వల భవిష్యత్ను ఇవ్వాలన్నద్దే సీఎం కేసీఆర్ సంకల్పమని గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. కరోనా కారణంగా రాష్ట్రంలో 200 -250 మంది వరకు పిల్లలు తల్లిదండ్రులను కోల్పోయి అనాథలయ్యారని ఆమె తెలిపారు. రాష్ట్రంలో సుమారు 15 వేల మంది వరకు అనాథలు ఉంటారని అంచనా.. వీరందనీ ప్రభుత్వం కంటిరెప్పలా సంరక్షిస్తుందని మంత్రి స్పష్టం చేశారు.
రాష్ట్రంలో అనాథలు, అనాథ ఆశ్రమాల స్థితిగతులను మెరగుపర్చాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ మంత్రి సత్యవతి రాథోడ్ అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఇవాళ ఆమె విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి వికారాబాద్ జిల్లా పరిగిలోని బాల సదన్ను పరిశీలించారు. సదన్లో వసతి పొందుతున్న పిల్లల ఆరోగ్య, చదువు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడారు.
సీఎం కేసీఆర్ పెద్ద మనసుతో అనాథ పిల్లల భవిష్యత్ కోసం గొప్పగా ఆలోచించారని అన్నారు. సమాజంలో అందరితో సమానంగా వీరికి అన్ని అవకాశాలు కల్పించేలా ప్రభుత్వం నూతన సంస్కరణలను అమలు చేయబోతుందని మంత్రి తెలిపారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అనాథలు అందరినీ ప్రభుత్వం అక్కున చేర్చుకోవాలని నిర్ణయించిందని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మహేష్ రెడ్డి, మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిషనర్, ప్రత్యేక కార్యదర్శి దివ్య దేవరాజన్, కలెక్టర్ పౌసమి బసు, ఇతర అధికారులు, నేతలు పాల్గొన్నారు.