కొడంగల్ : పేదల తిరుపతిగా పేరుగాంచిన కొడంగల్ మహాలక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో శ్రీనివాసుడికి లక్ష నామాలతో లక్ష తులసీ అర్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రావణ మూడో శనివారాన్ని పురస్కరించుకొని 51వ వార్షిక లక్ష తులసీ అర్చన మహోత్సవం అంగరంగవైభవంగా కొనసాగింది. తిరుమలలో తిరుమలేశుడికి నిర్వహించే విధంగా కొడంగల్ శ్రీనివాసుడికి పూజలు చేపడుతుండటంతో సుదూర ప్రాంతాల నుంచి భక్తులు పాల్గొని స్వామివారి ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని తిలకించి తన్మయత్వం పొందారు. వేద పండితులు ఏడుకొండలవాడిని లక్ష నామాలతో కొలుస్తూ లక్ష తులసీ దళాలతో అర్చన చేపట్టారు. భక్తుల తాకిడితో ఆలయం కిక్కిరిసింది.
లక్ష తులసీ అర్చన సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని రమణీయంగా తీర్చిదిద్దారు. భక్తులు స్వామిని దర్శించుకొని తమ గోత్రనామాలతో అర్చన చేపట్టేలా ఆలయ ధర్మకర్తలు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వేదబ్రాహ్మణులచే ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్విరామంగా లక్ష తులసీ అర్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేతుడై శ్రీనివాసుడు భక్తులకు దర్శనభాగ్యం కలిగించాడు. అనంతరం ఆలయ అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాల వితరణ చేపట్టారు.