కొడంగల్ : బంగారు తెలంగాణ నిర్మాణానికి సీఎం కేసీఆర్ రథ సారథిగా ఎనలేని కృషి చేస్తున్నారని రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాష్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని కేఎస్వీ ఫంక్షన్హాల్లో కొడంగల్, బొంరాస్పేట నూతన మండల కమిటీతో పాటు అనుబంధ కమిటీ ఎన్నిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా స్థానిక అంబేద్కర్ కూడలీలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి కూడలిలో టీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మలని, పార్టీ ప్రతిష్ఠతను కాపాడేది కూడా కార్యకర్తలు, కమిటీ సభ్యులేనని పేర్కొన్నారు. ప్రస్తుతం గ్రామ కమిటీ ఎన్నికలను పూర్తి చేసుకుని మండల, అనుబంధ కమిటీ ఎన్నికలను నిర్వహించుకుంటున్నట్లు తెలిపారు.
అన్ని వర్గాల వారిని సమన్వ యం చేస్తు గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర కమిటీలను ఏర్పాటు చేసే దిశగా సీఎం కేసీఆర్ ఆదేశాలను జారీ చేసినట్లు పేర్కొన్నారు. నూతనంగా ఎన్నుకోబడుతున్న కమిటీలు రానున్న రోజుల్లో కీలక పాత్ర పోషించనున్నాయని, గ్రామ, మండల కమిటీలతో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, విద్యా విభాగం, ఐటీ విభాగం వంటి 9 అనుబంధ కమిటీలను ఎన్నుకొంటున్నట్లు తెలిపారు. దీర్ఘకాలిక పోరాటంతో సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్ధే దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ బాటలు వేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో ఐటీ శాఖ భేష్గా ఉందని కితాబు ఇచ్చిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు శశిథరూర్ను అదే పార్టీకి చెందిన రేవంత్రెడ్డి హెళనగా మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.
అదే విధంగా ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి మాట్లాడుతూ కొడంగల్పై సీఎం ప్రత్యేక దృష్టిసారించి రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి అందించని విధంగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా 1లక్ష 50వేల ఎకరాలకు సాగునీరు అందేలా ప్రాజక్టును డిజైన్ చేసినట్లు తెలిపారు. త్వరలో టెండర్ ప్రక్రియను పూర్తి చేసి సంవత్సర కాలంలో కాలేశ్వరం రీతిలో పూర్తి చేయాలనే ఆశయంగా ఎంచుకున్నట్లు తెలిపారు. గ్రామ, పట్టణ ప్రాంతాలను స్వచ్ఛతగా తీర్చిదిద్ధేందుకు గాను పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ ముద్దప్ప దేశ్ముఖ్, కొడంగల్, బొంరాస్పేట మండలాల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మున్సిపల్ కౌన్సిలర్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లుతో పాటు సతీష్ముదిరాజ్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.