పరిగి, మార్చి 3 : పరిగి క్రీడల కేంద్రంగా మారనున్నది. ఇందుకు చకచకా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే పరిగిలో అంతర్ రాష్ట్రస్థాయి క్రీడలు నిర్వహించగా ఈ ప్రాంతంలోని పలువురు క్రీడాకారులు వివిధ ఆటల్లో జాతీయస్థాయిలో పాల్గొన్నవారు ఉన్నారు. వికారాబాద్ జిల్లా పరిగిలోనే ఇండోర్ స్టేడియం ఉండడంతో ఇండోర్ గేమ్స్కు ఉపయోగకరంగా మారనున్నది. ఖేలో ఇండియా స్టేట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఖోఖోకు పరిగి ఎంపికైంది. రెండు తెలుగు రాష్ర్టాల్లో ఖోఖో శిక్షణకు పరిగి ఎంపికవడం గమనార్హం.
ఖేలో ఇండియా స్టేట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఖోఖోగా పరిగిని ఎంపిక చేయగా.. నాలుగు సంవత్సరాలపాలు క్రీడాకారులకు ఖోఖోలో శిక్షణ ఇవ్వనున్నారు. ఖోఖో శిక్షణ కేంద్రానికి నాలుగు సంవత్సరాలపాటు ప్రతి సంవత్సరం రూ.5లక్షలు గ్రాంటుగా అందనున్నది. క్రీడాకారులకు వసతి, ఇతర సదుపాయాల కోసం మొదటి సంవత్సరం అదనంగా మరో రూ.5లక్షలు గ్రాంటు రానుంది. సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తారు. పరిగిలోని మినీ స్టేడియంలో 30 మందికి పైగా క్రీడాకారులకు ఖోఖోలో జాతీయ స్థాయిలో ఆడే విధంగా తర్ఫీదును ఇవ్వనున్నారు. మొదటగా వికారాబాద్ జిల్లా పరిధిలోని వారిని ఎంపిక చేసి టోర్నమెంట్లు నిర్వహించడంతోపాటు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. అనంతరం రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కలిగిన క్రీడాకారులను ఎంపిక చేసి ఖోఖోలో ప్రత్యేక శిక్షణ ఇస్తారు. రాష్ట్రం తరఫున జాతీయ స్థాయిలో ఆడే క్రీడాకారులకు కూడా ఖోఖోలో శిక్షణ కోసం ఈ కేంద్రం ఏర్పాటు చేశారు. ఇందుకుగాను తరచుగా ప్రతిభ కలిగిన క్రీడాకారులతో ప్రత్యేక టోర్నమెంట్ల నిర్వహణ కూడా జరుగుతున్నది. ఖోఖో అనేక జాతీయ పోటీల్లో మ్యాట్లపైనే ఆడతారు. అందువల్ల ఇక్కడి క్రీడాకారులకు కూడా మ్యాట్లపై ఆడేందుకు వీలుగా కొత్త మ్యాట్లు ఇప్పించేందుకు చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి ముందుకు వచ్చారు. త్వరలోనే ఇందుకు సంబంధించి మ్యాట్ను ఖోఖో శిక్షణ కేంద్రానికి అందజేయనున్నారు. ఇదిలావుండగా పరిగిలో త్వరలోనే రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీల నిర్వహణకు నిర్ణయించారు. పోటీల నిర్వహణ ఖర్చులన్నీ తాను భరిస్తానని, ఎప్పుడు నిర్వహించాలనేది నిర్ణయిస్తే ఏర్పాట్లు చేయిస్తానని ఎమ్మెల్యే మహేశ్రెడ్డి ప్రకటించారు. తద్వారా పరిగి త్వరలోనే రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలకు ఆతిథ్యం ఇవ్వనుంది.
పరిగిలోని ఇండోర్ స్టేడియంలో ఇప్పటికే షటిల్, ఇతర ఆటలు ఆడుతున్నారు. ఆటలు ఆడేందుకు మరింత సౌకర్యవంతంగా తయారు చేసేందుకు పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి రూ.30లక్షలను ఉడెన్ ఫ్లోరింగ్ కోసం మంజూరు చేయించారు. ఉడెన్ ఫ్లోరింగ్ ద్వారా నిత్యం షటిల్, ఇతర ఆటలు ఆడే క్రీడాకారులకు మోకాళ్ల నొప్పులు రాకుండా ఉంటాయి. ఇప్పటికే ఉడెన్ ఫ్లోరింగ్ పనులు ప్రారంభమయ్యయి. అలాగే ఇండోర్ స్టేడియంలో ప్రత్యేకంగా లైటింగ్ సైతం ఏర్పాటు చేయనున్నారు. ఉడెన్ ఫ్లోరింగ్తో ఇక్కడ రాష్ట్ర స్థాయి క్రీడలు కూడా నిర్వహించేందుకు అనువుగా ఉంటుందని క్రీడాకారులు తెలిపారు. ఎమ్మెల్యే ప్రత్యేక కృషితోనే ఈ ఉడెన్ ఫ్లోరింగ్ కొనసాగుతున్నది. సాధ్యమైనంత త్వరగా ఈ పనులు పూర్తి చేసేందుకు వేగంగా పనులు చేపడుతున్నారు.
– గాంగ్యా, ఎస్జీఎఫ్ జోనల్ కార్యదర్శి
పరిగిలో ఖోఖో శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయడం ఈ ప్రాంత క్రీడాకారులకు ఎంతో ఉపయోగకరం. పరిగి ప్రాంతంలో చక్కటి ప్రతిభ గల క్రీడాకారులున్నారు. పలువురు జాతీయస్థాయిలో ఆడినవారు ఉండడం కలిసివచ్చే అంశం. ప్రత్యేక శిక్షకురాలిని ఏర్పాటు చేసిన అధికారులు 30 మంది కంటే ఎక్కువ మందికి ఖోఖోలో శిక్షణ ఇప్పించడానికి ఏర్పాట్లు చేపట్టారు. క్రీడాకారులు ఆడేందుకు ప్రత్యేకంగా సుమారు నాలుగైదు లక్షల విలువ చేసే మ్యాట్ ఇప్పించేందుకు ఎంపీ రంజిత్రెడ్డి ముందుకు రావడం హర్షణీయం.
పరిగిలోని ఇండోర్ స్టేడియంలో ఉడెన్ ఫ్లోరింగ్ ఏర్పాటుతో క్రీడాకారులకు ఇబ్బందులు తప్పనున్నాయి. ప్రతిరోజూ షటిల్ వంటి ఆటలు ఆడే క్రీడాకారులకు చాలా ఉపయోగంగా చెప్పవచ్చు. స్థానిక ఎమ్మెల్యే మహేశ్రెడ్డి ప్రత్యేక చొరవతో రూ.30లక్షలు మంజూరు చేయించారు. త్వరలోనే పనులు పూర్తయ్యేలా వేగంగా ఉడెన్ ఫ్లోరింగ్ పనులు చేపడుతున్నారు. దీంతోపాటు స్టేడియంలో ఇతర సదుపాయాల కల్పనపై సైతం ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. దీంతో నిత్యం ఇక్కడ ఇండోర్ క్రీడలు నిర్వహించేందుకు వేదికగా మారుతుంది.