బోధన్, ఏప్రిల్ 29: పట్టణంలోని 18వ వార్డులో శుక్రవారం నిర్వహించే పోలింగ్ను కొవిడ్ నిబంధనలు పాటిస్తూ కొనసాగించాలని జిల్లా అదనపు కలెక్టర్ బీఎస్ లత అధికారులకు సూచించారు. పట్టణంలోని 18వ వార్డు ఉప ఎన్నికలో భాగంగా పోలింగ్ కొనసాగే పోలింగ్ బూత్లను గురువారం ఆమె ఆర్డీవో ఎస్. రాజేశ్వర్, మున్సిపల్ కమిషనర్ రామలింగం, అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె స్థానిక అధికారులకు పలు సూచనలు చేశారు. కొవిడ్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని పోలింగ్ కేంద్రాల వద్ద తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ముఖ్యంగా శానిటైజేషన్ ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లకు చేయించి లోనికి పంపాలని, ఓటరుకు ఓటరుకు మధ్య ఆరు మీటర్ల దూరం ఉండేలా గుర్తులు ఏర్పాటు చేసి వారి మధ్య భౌతికదూరం ఉండేలా చర్యలు చేపట్టాలని అన్నారు. పోలింగ్ సందర్భంగా విధులు నిర్వహించే అధికారులతోపాటు, మిగతా అధికారులు కూడా పోలింగ్ పూర్తయి బ్యాలెట్ బాక్స్లు స్ట్రాంగ్ రూమ్కు చేరేంత వరకు అప్రమత్తంగా విధుల నిర్వహించాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియను సజావుగా కొనసాగించాలని, ఓటర్ల కోసం టెంట్లు వేయించాలని, సదరు టెంట్లలో సైతం వారు భౌతికదూరం పాటించేలా సూచించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ లత వెంట బోధన్ ఆర్డీవో ఎస్.రాజేశ్వర్, మున్సిపల్ కమిషనర్ జి. రామలింగం, డీఈఈ లింగంపల్లి శివానందం, సిబ్బంది ఉన్నారు.