వికారాబాద్ : గిరిజన సంక్షేమ శాఖ ద్వారా నిరుద్యోగ యువతకు జాతీయ నిర్మాణ సంస్థ నేషనల్ అకాడమి ఆఫ్ కన్సరక్షన్ ఎన్ఏసీ మాదారం హైదరాబాద్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అభివృద్ధి అధికారి ఆర్. కొఠాజీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గిరిజన తెగకు చెందినవారై ఉండాలని, కనీసం వయస్సు 18 నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉండాలన్నారు. అభ్యర్థి కుటుంబ వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ. 1.50 లక్షలు, పట్టణ ప్రాంతం వారు రూ. 2లక్షలకు మించరాదన్నారు. ఫినిషింగ్ స్కూల్ ట్రైనింగ్ ప్రోగ్రాం కోర్సు కోసం 3 నెలలు కాల పరిమితి, బీటెక్, సివిల్, బీ.ఈ సివిల్ అర్హత కలిగిన వారి వయస్సు 21-40 సంవత్సరాల మధ్య ఉండాలన్నారు.
సూపర్ వైజర్ స్ట్రక్చర్ కోర్సు కొరకు 3 నెలలు ఉంటుందని, ఇంటర్, ఐటీఐ,(సివిల్) డిప్లామా కలిగిన వారు అర్హులన్నారు. వయస్సు 21 నుంచి 35 సంవత్సరాల గల అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఆసక్తి గల యువతీ, యువకులు www.nac.edu.in లేదా https://tstribalwelfare.cgg.gov.in లో ఈ నెల 20వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.