వికారాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ పటిష్టతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. శుక్రవారం ఎమ్మెల్యే నివాసంలోని వికారాబాద్ మండల అధ్యక్షున్ని ప్రజాప్రతినిధులు, నాయకుల సమక్షంలో ఏక గ్రీవంగా ఎన్నుకున్నారు. వికారాబాద్ మండల పులుసుమామిడి గ్రామానికి చెందిన సర్పంచ్ కమాల్రెడ్డిని రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా కమాల్రెడ్డి మాట్లాడుతూ నాపై నమ్మకంతో మండల అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి పని చేస్తానన్నారు. పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తామని వివరించారు.
అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మెగా బ్లెడ్ డోనేషన్ క్యాంపు బ్రోచర్ను పార్టీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. శనివారం వికారాబాద్ పట్టణంలోని ఆర్యవైశ్య కల్యాణ మండపంలో ఈ క్యాంపు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే ఆనంద్ తెలిపారు. అదే విధంగా వికారాబాద్ పట్టణంలో గణేష్ నిమజ్జనం శోభయాత్ర కోసం ఏర్పాట్లను పరిశీలించారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో నిమజ్జనం ప్రశాంతంగా జరిగే విధంగా కృషి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. పట్టణ సమీపంలో ఉన్న కొంపల్లి చెరువులో నిమజ్జనం చేసే స్థలాన్ని వికారాబాద్ డీఎస్పీ సంజీవరావుతో కలిసి పరిశీలించారు. అనంతరం వికారాబాద్ పట్టణంలోని కొంపల్లి, అనంతగిరిపల్లిలో వినాయకులకు ఎమ్మెల్యే ఆనంద్ ప్రత్యేక పూజలు చేశారు. మండపాల వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రమేశ్కుమార్, కౌన్సిలర్లు, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, నాయకులు పాల్గొన్నారు.