రంగారెడ్డి, జనవరి 25, (నమస్తే తెలంగాణ) : ప్రస్తుత రోజుల్లో ఇంగ్లిష్ భాష ప్రాధాన్యత దృష్ట్యా ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియాన్ని మూడేండ్లలో పూర్తిస్థాయిలో అమల్లోకి తీసుకువచ్చేందుకు నిర్ణయించారు. ప్రపంచీకరణ దృష్ట్యా ఇంగ్లిష్ భాషపై పట్టు సాధించాల్సిన నేపథ్యంలో ఆ మేరకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్లలోనే ఇంగ్లిష్ మీడియం చదువులు అనే పరిస్థితులకు చెక్ పెడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు కూడా ఇంగ్లిష్ మీడియాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు నిర్ణయించింది. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోని పేద విద్యార్థులకు వరంగా మారనున్నది. కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్లలో చదువుకోలేని పేద విద్యార్థులను పరిగణనలోకి తీసుకొని సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం జిల్లాలోని సబ్బండ వర్ణాల నుంచి హర్షం వ్యక్తం అవుతుంది. ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న పేద విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ప్రభుత్వ నిర్ణయంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే జిల్లాలోని స్కూళ్లలో అడ్మిషన్లకు ప్రతి ఏటా క్యూ కడుతుండడం గమనార్హం.
వచ్చే విద్యాసంవత్సరం నుంచి జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం అమల్లోకి రానున్నది. ఇప్పటికే జిల్లాలో పలు పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం అమలవుతున్నది. జిల్లావ్యాప్తంగా 546 స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం అమలవుతుండగా, వీటిలో 127 సక్సెస్ పాఠశాలలున్నాయి. గత ఐదారేండ్లుగా జిల్లాలో సక్సెస్ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియంలోనే విద్యాబోధన కొనసాగుతున్నది. ఈ బడుల్లో తెలుగు మీడియం కూడా కొనసాగుతూ వస్తున్నది. ఇంగ్లిష్ మీడియం, తెలుగు మీడియానికి ప్రత్యేకంగా ఉపాధ్యాయులున్నారు. మిగతా 419 ప్రభుత్వ పాఠశాలల్లో రెండేళ్లుగా ఇంగ్లిష్ మీడియం అమల్లోకి వచ్చింది. మిగతా ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేసేలా సంబంధిత పాఠశాల పేరెంట్ కమిటీ, విద్యార్థులు, ఉపాధ్యాయుల కోరిక మేరకు ప్రభుత్వం అనుమతులిచ్చింది. ప్రైమరీ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియాన్ని అమలుకుగాను జిల్లా విద్యాశాఖ అధికారి అనుమతులు జారీ చేస్తుండగా, ఉన్నత పాఠశాలల్లోనూ విద్యాబోధనకుగాను రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ నుంచి అనుమతులు మంజూరు అవుతున్నాయి. జిల్లావ్యాప్తంగా 546 స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియంలో బోధన జరుగుతుండగా, వీటిలో 159 ఉన్నత పాఠశాలలు, 104 ప్రాథమికోన్నత పాఠశాలలు, 283 ప్రాథమిక పాఠశాలలున్నాయి.
జిల్లాలోని ఇంగ్లిష్ మీడియం స్కూళ్లలో విద్యనభ్యసించేందుకు పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతున్నారు. జిల్లాలోని పలు పాఠశాలల్లో విద్యార్థులు చేరడంతో సెక్షన్ల వారీగా విభజించి బోధిస్తున్న పరిస్థితి నెలకొంది. ఉపాధ్యాయులు విద్యార్థులకు ఇంగ్లిష్ భాషపై పట్టు సాధించే విధంగా బోధిస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం జిల్లాలో 546 ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం అమలవుతుండగా 55,268 మంది విద్యార్థులున్నారు.
వికారాబాద్ జిల్లాలోని 277 పాఠశాలల్లో..
పరిగి, జనవరి 25 : ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన విద్యార్థులకు తమ భవిష్యతులో ఉపయోగకరంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఓవైపు మధ్యతరగతి వారు, కొందరు పేదలు సైతం తమ పిల్లలను ఇంగ్లిష్ మీడియం స్కూళ్లలో చదివించేందుకు ప్రతి సంవత్సరం వేలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సర్కారు బడుల్లో ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన పేద విద్యార్థులకు మరింత మేలు చేకూరుస్తున్నది. వికారాబాద్ జిల్లా పరిధిలో ఇప్పటికే ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన చేస్తున్న సర్కారు బడులు ఉన్నాయి. జిల్లాలోని సక్సెస్ స్కూళ్లకు తోడుగా తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు పలు పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన జరుగుతుంది. వికారాబాద్ జిల్లాలో మొత్తం 1,084 పాఠశాలలుండగా, వాటిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు 170, ప్రాథమిక పాఠశాలలు 712, యూపీఎస్లు 173, కేజీబీవీలు 18, మోడల్ స్కూళ్లు 9, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు 2 ఉన్నాయి.
ఇందులో సక్సెస్ స్కూళ్లతోపాటు గురుకులాలు, మోడల్ స్కూళ్లు, కొన్ని కేజీబీవీ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన కొనసాగుతున్నది. జిల్లా వ్యాప్తంగా 132 ప్రాథమిక పాఠశాలలు, 23 యూపీఎస్లు, 61 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో సైతం ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన కొనసాగుతున్నది. జిల్లాలోని 61 సక్సెస్ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమంలో బోధన జరుగుతుంది. సక్సెస్ స్కూళ్లలో ఉపాధ్యాయులకు అనేక మాడ్యూల్స్ అందజేయడంతోపాటు ప్రత్యేకంగా శిక్షణ సైతం ఇవ్వడం జరిగింది.
విద్యార్థుల్లో పెంపొందుతున్న అవగాహన
జిల్లాలోని 277 పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన జరుగుతుండగా, మరోవైపు ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని సర్కారు బడుల్లో అమలు చేస్తామని ప్రకటించింది. తల్లిదండ్రులు తమ గ్రామంలోని సర్కారు బడిలో ఆంగ్ల మాధ్యమం విద్యాబోధనతో చాలావరకు పిల్లల్ని స్వంత ఊర్లోని పాఠశాలల్లో చదివిస్తున్నారు. ఆరు నెలల్లోనే చాలావరకు విద్యార్థుల్లో మార్పు వచ్చిందని ఉపాధ్యాయులు, విద్యార్థులు పేర్కొంటున్నారు. గురుకులాలు, మోడల్ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నది. ఉన్నత విద్యలోను వారు ఆంగ్ల మాధ్యమంలోనే చదువుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.
ఇంగ్లిష్లోనే బోధన చేస్తున్నారు
మా పాఠశాలలో ఉపాధ్యాయులు ఇంగ్లిష్లోనే బోధన చేస్తున్నారు. నేను పదో తరగతి చదువుతున్నా. ప్రైవేట్ స్కూల్లో ఫీజులు కట్టే అవసరం లేకుండా… ప్రభుత్వ పాఠశాలల్లోనే అన్ని రకాల సదుపాయాలు కల్పించడంతో సంతోషంగా చదువుకుంటున్నా. టీచర్లు అన్ని సబ్జెక్టులు ఇంగ్లిష్లోనే బోధిస్తున్నారు. పేద విద్యార్థుల కోసం ప్రభుత్వం అన్ని పాఠశాలల్లో ఇంగ్లిష్ బోధన చేపట్టేందుకు నిర్ణయం తీసుకోవడం సంతోషకరం.
ఇంగ్లిష్ మీడియం చదువాలని ఇష్టం
గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లిష్ మీడియం చదవాలని ఇష్టం. వచ్చే ఏడాదినుంచి ఇంగ్లిష్ మీడియం పెడుతున్నారంటే మాకు సంతోషంగా ఉంది. నాతోటి పిల్లలు కూడా ప్రభుత్వ బడుల్లోనే చదువుతామంటున్నారు. ఇలా చేస్తే ప్రైవేటు పాఠశాలల ఫీజుల బాధ తప్పుతుంది. తల్లిదండ్రులు చాలా సంతోషిస్తారు.
ఆంగ్ల బోధన తప్పనిసరి
మారుతున్న కాలానికి అనుగుణంగా నేటి తరం విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియం విద్య తప్పనిసరి ఉండాలి. పోటీ ప్రపంచంలో రాణించాలంటే కచ్చితంగా ఇంగ్లిష్పై పట్టుండాలి. మా పాఠశాలో ఇంగ్లిష్ మీడియం కొనసాగుతున్నది. చాలా మంది విద్యార్థులు ఇంగ్లిష్ మీడియంలో రాణిస్తున్నారు. ముఖ్యంగా పేద విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతున్నది.
మంచిగా చెబుతుండ్రు..
అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియంలోనే చెప్పాలి. సర్కారు పాఠశాలల్లో మంచిగా చెబుతుండ్రు. అన్ని పాఠ్యాంశాలు అర్థమవుతున్నాయి. 10వ తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. సీఎం కేసీఆర్ అన్ని పాఠశాలల్లో ఈ మీడియాన్ని పెడుతామని చెప్పడం సంతోషంగా ఉంది. దీంతో అందరూ ఇంగ్లిష్ మీడియంలో చదువొచ్చు.
– నరేష్, 10వ తరగతి విద్యార్థి, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, షాద్నగర్
పేద పిల్లల భవిష్యత్కు సర్కార్ కృషి
సర్కార్ పాఠశాలల్లో పేద పిల్లల భవిష్యత్ కోసం సర్కార్ కృషి చేస్తుంది. నా కూతురు షాబాద్లో సర్కార్ స్కూల్లో పదో తరగతి చదువుకుంటున్నది. వేలకు వేలు ఫీజులు కట్టి ప్రైవేట్ స్కూళ్లకు పంపకుండా సర్కార్ బడికి పంపుతున్నాను. స్కూల్లో అన్ని ప్రభుత్వమే ఇస్తున్నది. ఇంగ్లిష్లో చదువు చెప్పడంతో నా బిడ్డ మంచి ప్రయోజకురాలు అవుతుందని అనుకుంటున్నాను.
ప్రభుత్వ నిర్ణయం బాగుంది
పేద విద్యార్థులకు మంచి చదువు నేర్పేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం ఎంతో బాగుంది. నా బిడ్డ సర్కార్ పాఠశాలలో పదో తరగతి చదువుకుంటున్నది. రూపాయి ఖర్చు లేకుండా అన్ని ప్రభుత్వమే అందించడం సంతోషకరం. ప్రైవేట్ పాఠశాలల్లో నేర్పే దానికంటే ఎక్కువగానే ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఇంగ్లిష్లో చదువు చెప్పడం బాగుంది.
-పి. మల్లయ్య, విద్యార్థి తండ్రి కుమ్మరిగూడ షాబాద్
పేద విద్యార్థులకు ఉపయోగం
అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధన అమలులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పేద విద్యార్థులకు ఎంతో ఉపయోగపడనున్నది. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం అన్ని రకాల సదుపాయలు కల్పిస్తున్నది. గతంలో ఎంపిక చేసిన పాఠశాలల్లోనే ఇంగ్లిష్ మీడియం బోధన ఉండేది. తాజాగా అన్ని పాఠశాలల్లో అమలు చేస్తే పేద విద్యార్థులకు మంచి లబ్ధి చేకూరనున్నది.
ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు
ప్రభుత్వపాఠశాలలో ప్రభుత్వం ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టడం సంతోషకరం. ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాలలకు దీటుగా కొనసాగుతాయి. ఇబ్రహీంపట్నం బాలుర ఉన్నత పాఠశాలలో ఇప్పటికే ఆంగ్లమాధ్యమం కొనసాగుతుండటంతో ఈ పాఠశాలలో పెద్ద ఎత్తున నా లాంటి విద్యార్థులు చేరుతున్నారు. ఆంగ్లమాధ్యమంతో ప్రతి విద్యార్థికి ఎంతో మేలు చేకూరుతుంది. – సాహిత్, ఇబ్రహీంపట్నం బాలుర పాఠశాల
ఇంగ్లిష్పై మంచి పట్టు సాధించా..
ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 6వ తరగతిలో ఇంగ్లిష్ మీడియంలో చేరాను. ఈ పాఠశాలలో చేరినప్పటి నుంచి ఇంగ్లిష్పై మంచి పట్టుసాధించాను. ఇక్కడ ప్రైవేటు పాఠశాలల కంటే మంచిగా ఆంగ్లంలో విద్యను బోధిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టడం సంతోషకరం.
అభిలాష్, ఇబ్రహీంపట్నం ఉన్నత పాఠశాల
నాణ్యమైన విద్యకు కృషి చేస్తున్నారు..
సర్కారు బడుల్లో ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశ పెట్టడం చాలా సంతోషకరం. గత ప్రభుత్వాల హయాంలో విద్యార్థుల చదువు, పాఠశాలల అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఏ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. సీఎం కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి, పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తున్నారు. విదార్థులకు నాణ్యమైన విద్యతోపాటు, పౌష్టికరమైన ఆహారం అందించేందుకు గురుకులాలు, మోడల్ స్కూళ్లను ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు.
ప్రైవేట్కు దీటుగా చదువు నేర్పిస్తున్నారు
ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యనందిస్తున్నారు. నేను ఆరో తరగతి నుంచి ఈ పాఠశాలలోనే చదువుతున్నాను. ఇంగ్లిష్ మీడియం ఉండడంతో బాగా చదువుకుంటున్నా. సర్కార్ బడుల్లో ఎంతోమంది విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదిగే అవకాశం ఉంది.
ప్రభుత్వ నిర్ణయం సంతోషకరం
ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టాలనే ప్రభుత్వం నిర్ణయం సంతోషకరం. ప్రభుత్వానికి యావత్తు విద్యార్థిలోకం రుణపడి ఉంటుంది. విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు ఆంగ్లమాధ్యమం ఎంతో ఉపయోగపడుతుంది.