పరిగి, డిసెంబర్ 30: మున్సిపాలిటీల్లో పారిశుధ్యం, అభివృద్ది పనులపై ప్రత్యక్షంగా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సూచించారు. గురువారం జిల్లాల స్థానిక సం స్థల అదనపు కలెక్టర్లు, మున్సిపల్ చైర్మన్లు, కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పట్టణ ప్రగతి, స్వచ్ఛ సర్వేక్షణ్-2022 వర్చువల్ ఓరియంటేషన్ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. పట్టణ ప్రగతిలో భాగంగా పారిశుధ్యం, పచ్చదనం, వైకుంఠధామాలు, డంప్ యార్డులు, పబ్లిక్ టాయిలెట్స్ నిర్వహణ, వెజ్, నాన్వెజ్ మార్కెట్ల ఏర్పాటు, ఇంటింటి నుంచి తడి, పొడి చెత్త సేకరణ తదితర కార్యక్రమాలపై దిశా నిర్దేశం చేశారు. నిరంతర పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్న సిబ్బందికి మంత్రి ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్ దార్శనికతలో దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రామాలు, పట్టణాలు సమ్మిళితమైన, సమతుల్యమైన పద్ధతులలో వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. గ్రామీణ అభివృద్ధిని, వ్యవసాయాన్ని, ఐటీ రంగాన్ని ముఖ్యమంత్రి వివిధ ప్రోత్సాహకాలతో నడిపిస్తున్నారన్నారు. పల్లెలను పట్టణాలతోపాటు దీటుగా పల్లె ప్రగతి కార్యక్రమాలతో గ్రామీణ అభివృద్ధ్ది కార్యక్రమాలను నిరంతరం చేపడుతున్నారని, కేంద్రం ప్రకటించిన పల్లె వికాసం అవార్డులో మనమే ముందున్నామని మంత్రి తెలిపారు.
అదనపు కలెక్టర్లు క్షేత్ర స్థాయిలో పర్యటించాలని, ఎక్కడైనా అలసత్వం, నిర్లక్ష్యం ఉంటే చర్యలు తీసుకోవాలన్నారు. దేశంలోనే మిషన్ భగీరథ గొప్ప కార్యక్రమమని, ప్రతి ఇంటికీ మంచినీరు అందేలా సవ్యమైన పద్ధతిలో ప్రజలకు సరైన సేవలు అందించే దిశలో ప్రజా ప్రతినిధులు, అధికారులు పనిచేయాలన్నారు. కరోనా కారణంగా ప్రజలు డిజిటల్ సేవల వైపు మళ్లారని, అధికారులు సైతం సోషల్ మీడియాలో చురుకుగా ఉండి ప్రజల ఫిర్యాదులపై తక్షణమే స్పందించి పరిష్కరించాలన్నారు. గతంలో గంగదేవిపల్లి ఒక్కటే ఆదర్శ గ్రామంగా ఉండేదని, ప్రస్తుతం ప్రతి పల్లె ఆదర్శ గ్రామంగా తయారవుతున్నదని చెప్పారు. వీధులలో నేమ్బోర్డులు ఏర్పాటు చేయాలని, చేసిన పనులపై కరపత్రాలు, బుక్లెట్స్ రూపంలో ప్రజలకు తెలియజేయాలని మంత్రి సూచించారు. పచ్చదనం పెంపొందించే దిశగా పట్టణ ప్రణాళిక అభివృద్ది చేయాలని, స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనాలన్నారు. రాష్ట్ర స్పెషల్ చీఫ్ సెక్రెటరీ, ఎండీ ఎస్బీఎం అరవింద్కుమార్ పరిశుభ్రమైన పట్టణం, స్వచ్ఛ సర్వేక్షణ్ 2022 కార్యక్రమాలపై ప్రజా ప్రతినిధులు, అధికారులు చేపట్టాల్సిన కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చంద్రయ్య, మున్సిపాలిటీల చైర్మన్లు, కమిషనర్లు, సిబ్బంది పాల్గొన్నారు.