పరిగి/షాబాద్, డిసెంబర్ 30 : మార్కెట్లో పత్తి ధర రోజురోజుకూ పెరిగిపోతున్నది. పత్తి పంట సాగుచేసిన రైతులకు సిరుల పంట కురిపిస్తున్నది. చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా ఊహించని రీతిలో ధర పలుకుతున్నది. జాతీయ మార్కెట్లో తెలంగాణ పంటకు రికార్డు స్థాయిలో డిమాండ్ ఉండడంతో మార్కెట్లో ఖరీదుదారులు పంటను కొనుగోలు చేసేందుకు పోటీపడుతున్నారు. పంట సీజన్ ప్రారంభం నుంచే సీసీఐ(కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా)మద్ధతు ధర కంటే అధికంగా పలుకుతుండడం విశేషం. ఈ ఏడాది పత్తికి సీసీఐ మద్దతు ధర క్వింటాలుకు రూ.6025 కాగా, సీజన్ ప్రారంభంలోనే ప్రైవేట్ వ్యాపారులు క్వింటాలుకు రూ.7వేల చొప్పున వెచ్చించి పత్తిని కొనుగోలు చేశారు. దీంతో రంగారెడ్డిజిల్లాలో ఎక్కడా కూడా సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. పత్తి ధర రోజురోజుకూ క్రమం తప్పకుండా పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా నెలాఖరులో రికార్డు స్థాయి ధర పలికింది. ఆయా ప్రైవేట్ మార్కెట్లలో ఖరీదుదారులు ఎక్కువ మొత్తంలో పంటను కొనుగోలు చేసేందుకు పోటీపడడంతో గరిష్ఠ ధర రూ.9వేలు పలుకుతున్నది.
ఉమ్మడి జిల్లాలో పత్తిసాగు
రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది వానకాలం సీజన్లో రైతులు 1,31,609 ఎకరాల్లో, వికారాబాద్ జిల్లాలో 1,90,677 ఎకరాల్లో పత్తి పంట సాగుచేసినట్లు సంబంధిత వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. రంగారెడ్డి జిల్లాలో సుమారు 10.50లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. జిల్లాలో అత్యధికంగా ఆమనగల్లు డివిజన్లో 40వేల ఎకరాల్లో, చేవెళ్ల డివిజన్లో 20వేల ఎకరాల్లో రైతులు పత్తిపంటను సాగు చేశారు. వికారాబాద్ జిల్లాలో పత్తి ఉత్పత్తి 2 లక్షల మెట్రిక్ టన్నులు దాటుతుందని అంచనా వేయగా.. వర్షాల వల్ల దెబ్బతిన్నది. ఈ నేపథ్యంలో 1,14,406 మెట్రిక్ టన్నుల పత్తి ఉత్పత్తి అవుతుందని వ్యవసాయాధికారులు అంచనా వేశారు.
హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు
పత్తి పంటకు గతంలో ఎప్పుడూ లేనివిధంగా మార్కెట్లో ధర పలుకడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకు 8 నుంచి 10 క్వింటాళ్ల వరకుపత్తి దిగుబడులు వస్తున్నాయి. ఒక్కో రైతు 5 నుంచి 10 ఎకరాల వరకు పత్తి పండిస్తున్నాడు. సీసీఐ మద్ధతు ధర కంటే బయటి మార్కెట్లో ధరలు అత్యధికంగా రూ.9వేలు ఉండడంతో రైతులు పత్తిని బయట మార్కెట్కు తీసుకువెళ్లి అమ్ముకుంటున్నారు. కూలీల ఖర్చులు పోగా లాభాలు మంచిగానే వస్తున్నాయని రైతులు చెబుతున్నారు.