పరిగి/ఇబ్రహీంపట్నం, జనవరి 20 : కరోనా సెకండ్ వేవ్ సమయంలో దేశానికే తలమానికంగా నిలిచిన ఇంటింటికీ జ్వర సర్వే మరోసారి చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో శుక్రవారం నుంచి ఇంటింటి సర్వేకు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. ఈమేరకు గురువారం వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టీ.హరీశ్రావు, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ సూచనలతో ఇంటింటికీ సర్వే చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి ప్రతిరోజూ ఈ సర్వే కొనసాగించేలా నిర్ణయించారు. ప్రతిగ్రామంలో ప్రతి వెయ్యినుంచి మూడువేల మందికి ఒక ఆశవర్కర్ను నియమించి ఇంటింటికీ సర్వే నిర్వహించనున్నారు. ఈ సర్వేలో జ్వరం, కొవిడ్ లక్షణాలున్నవారి జాబితాను ఆశవర్కర్లు సంబంధిత ఏఎన్ఎంలకు అందజేస్తారు. ఏఎన్ఎంలు కరోనా సోకిన వారికి నేరుగా ఇంటికి మందులను అందజేయనున్నారు. ఇందుకోసం అన్ని సబ్సెంటర్ల పరిధిలో గ్రామగ్రామాన పరీక్షల కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.
ఇక నుంచి ప్రతీ పీహెచ్సీలో కొవిడ్ టెస్టులు
ఇక నుంచి రంగారెడ్డిజిల్లాలోని ప్రతి ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో కొవిడ్ టెస్టులను చేయాలని వైద్యారోగ్యశాఖ నిర్ణయించింది. జిల్లా పరిధిలోని ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్, మహేశ్వరం, షాద్నగర్, చేవెళ్ల నియోజకవర్గాల్లో అన్ని డివిజన్లలో జ్వర సర్వేను ముమ్మరం చేయనున్నారు. అనుమానితులందరినీ గుర్తించి వారికి ముందు జాగ్రత్తగా మందులను పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. సర్వేను వేగవంతం చేయాలని వైద్యారోగ్యశాఖ ఆదేశాలు జారీచేసింది.
డీఎంహెచ్వో ఆధ్వర్యంలో అత్యవసర టీంలు
ఎక్కడైనా అత్యవసర పరీక్షలను నిర్వహించడం కోసం డీఎంహెచ్వో కార్యాలయంలో ప్రత్యేక టీంలను అందుబాటులో ఉంచినట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు. నగరశివార్లతో పాటు వివిధ ప్రాంతాల్లో ఉన్న గ్రేటర్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్లలో కేసుల సంఖ్య పెరిగినప్పుడు ఈ టీంల ఆధ్వర్యంలో ప్రత్యేక పరీక్షలు నిర్వహించడంతోపాటు మందులను అందజేస్తారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడం కోసం ఈ టీంలు అనునిత్యం అప్రమత్తంగా ఉంటాయి.
సర్వేలో ఆశ వర్కర్లదే కీలకపాత్ర
కరోనా కట్టడి కోసం నిర్వహిస్తున్న జ్వర సర్వేలో ఆశ వర్కర్లు కీలక పాత్ర పోషించనున్నారు. ప్రతి వెయ్యి నుంచి మూడువేల మంది జనాభాకు ఒక ఆశ వర్కర్ చొప్పున ప్రభు త్వం నియమించింది. ఆశ వర్కర్ తన పరిధిలోని ఇంటింటికీ వెళ్లి సర్వే నిర్వహిస్తారు. జాబితాను ఏఎన్ఎంలకు పంపిస్తే.. వారు బాధితుల ఇంటికి వెళ్లి మందులను అందజేస్తారు.
ముమ్మరంగా జ్వర సర్వే : స్వరాజ్యలక్ష్మి, డీఎంహెచ్వో
కరోనాను కట్టడి చేసేందుకు ఆశవర్కర్లు, ఏఎన్ఎంల ద్వారా ముమ్మరంగా ఇంటింటికీ సర్వే నిర్వహించనున్నాం. జిల్లాలో 358 ప్రత్యేక టీంలతో కొవిడ్ లక్షణాలు, జ్వరం ఉన్నవారిని గుర్తించి వారికి వెంటనే కరోనా కిట్స్ అందజేసి హోం ఐసోలేషన్లో తీసుకోవల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించనున్నాం. జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక అత్యవసర టీంలను కేటాయించి ఈ టీంల ద్వారా అత్యవసరమున్న చోట్ల పరీక్షలు నిర్వహించనున్నాం. కొవిడ్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో మాస్కులు ధరించడంతోపాటు సామాజిక దూరం పాటించాలి.
వికారాబాద్ జిల్లాలో 30వేల వరకు ఐసొలేషన్ కిట్లు
ఇంటింటికీ సర్వేలో భాగంగా 15-17 ఏండ్ల వయసు గల వారుంటే మొదటి డోసు, 18 ఏండ్లు పైబడినవారిలో రెండో డోసు, 60 ఏండ్లు పైబడిన వారికి ప్రికాషనరీ డోసు వేయనున్నారు. కమిటీల్లో గ్రామంలో ఆరోగ్య కార్యకర్త, అంగన్వాడీ కార్యకర్త, ఆశ వర్కర్, వీఆర్ఏ, గ్రామపంచాయతీ కార్యదర్శి ఉంటారు. మున్సిపాలిటీలో ఆరోగ్య కార్యకర్త, అంగన్వాడీ కార్యకర్త, మున్సిపల్కు చెందిన ఉద్యోగి ఉంటారు. వారు ప్రతిరోజూ 20 నుంచి 30 ఇండ్లకు వెళ్లి ఆయా కుటుంబాల వారి వివరాలు సేకరిస్తారు. జిల్లాలో 566 గ్రామపంచాయతీలు ఉండగా 721 హ్యాబిటేషన్లు, నాలుగు మున్సిపాలిటీల పరిధిలో 97 వార్డులున్నాయి. మండలస్థాయిలో ఎంపీడీవో, తహసీల్దార్, ఎంపీవో, మం డల వైద్యాధికారులు సర్వేలను పర్యవేక్షిస్తారు. ప్రతి మండలాన్ని నాలుగు క్లస్టర్లుగా విభజించి ప్రతిరోజూ కనీసం పది గ్రామాలను మండలస్థాయి అధికారులు సందర్శించి ఇంటిం టి సర్వే జరుగుతున్న తీరును పరిశీలిస్తారు. సర్వే సందర్భంగా ఇంటింటి నుంచి సేకరించిన వివరాలు పొందుపరిచే రిజిస్టర్ల నిర్వహణ సక్రమంగా ఉండాలి. దీని ఆధారంగా మెడికల్ ఆఫీసర్ నిర్ణయంతో ఐసొలేషన్ కిట్లు అందజేస్తారు. వికారాబాద్ జిల్లాలో సుమారు 30వేల పైచిలుకు హోం ఐసోలేషన్ కిట్లు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సీహెచ్సీ, జిల్లా దవాఖాన, ఆరోగ్య ఉప కేంద్రంలో హోం ఐసొలేషన్ కిట్లు అందుబాటులో ఉంచారు.
ఇంటింటి సర్వే : తుకారాంభట్, వికారాబాద్ జిల్లా వైద్యాధికారి
జిల్లాలోని ఇంటింటి సర్వే శుక్రవారం నుంచి ప్రారంభమవుతుంది. పట్టణాల్లో పాజిటివ్ రేటు అధికంగా ఉన్నందున ముందుగా పట్టణాల్లో వేగంగా సర్వే పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేపడుతున్నాం. జలుబు, దగ్గు, జ్వరం లక్షణాలు ఉన్నవారి వివరాలు సంబంధిత వైద్యాధికారికి టీం సభ్యులు తెలియజేస్తారు. వైద్యాధికారి నిర్ణయంతోనే సంబంధిత వ్యక్తులకు హోంఐసొలేషన్ కిట్లు ఇస్తాం. సర్వేలో ఎవరైనా టీకాలు తీసుకోని వారుంటే వారికి ఇంటి వద్దే కొవిడ్ టీకా వేస్తారు.