వికారాబాద్, నమస్తే తెలంగాణ : వికారాబాద్ జిల్లాలో పని చేయడం చాలా సంతోషంగా ఉందని జిల్లా కలెక్టర్ పౌసుమిబసు తెలిపారు. బుధవారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని డీపీఆర్సీ భవన్లో కలెక్టర్ పౌసుమిబసుకు జిల్లా యంత్రాంగం తరపున ఘనంగా వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పౌసుమిబసు మాట్లాడుతూ వికారాబాద్ జిల్లా ప్రజలు చాలా మంచి వారని, ఈ జిల్లాలో పని చేసినందుకు సంతోషంగా ఉందన్నారు. జిల్లా అధికారులు టీమ్ వర్క్ల అందరూ బాగా పని చేశారని ముఖ్యంగా కొవిడ్ కాలంలో పని చేసి నియంత్రించడం జరిగిందని గుర్తు చేశారు.
ప్రభుత్వ కార్యక్రమాలైన రైతు వేదికలు, వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాల ఏర్పాట్లు బాగా చేశారని ప్రశంసించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులకు అందించిన సహకారానికి కృతజ్ఞతలు తెలియజేశారు. మునుముందు ఇదే స్ఫూర్తితో పని చేసి ప్రజలకు సేవలందించాలని కోరారు. కార్యక్రమంలో ఆయా శాఖల జిల్లా అధికారులు, రెవెన్యూ సిబ్బంది, ఎంపీడీవోలు పాల్గొన్నారు.