న్యూఢిల్లీ: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష డీఎంకే భారీ మెజారిటీతో విజయానికి చేరువైంది. దాంతో ఆ పార్టీ శ్రేణులు తమతమ అభిమాన నాయకుల ఇండ్లముందు సంబురాలు చేసుకుంటున్నారు. పటాకులు కాలుస్తూ, డోళ్లు వాయిస్తూ, నృత్యాలు చేస్తూ ఆనంద డోలికల్లో మునిగి తేలుతున్నారు. అయితే, ఈ విజయోత్సవాలపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. ఎన్నికల ఫలితాలు వెలువెడిన తర్వాత ఎలాంటి విజయోత్సవాలు నిర్వహించకూడదంటూ తాము గతంలోనే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా ఎవరూ పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
అంతేగాక, తమ ఆదేశాలను ధిక్కరిస్తూ వివిధ ప్రాంతాల్లో సంబురాలు చేసుకున్న ఘటనలకు ఆయా ప్రాంతాల స్టేషన్ హౌస్ ఆఫీసర్లను బాధ్యులను చేస్తూ వెంటనే విధుల నుంచి తొలగించాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రాల చీఫ్ సెక్రెటరీలకు ఆదేశాలు జారీచేసింది. దాంతో తమిళనాడు చీఫ్ సెక్రెటరీ తెయినమ్పేట్ పోలిస్ ఇన్స్పెక్టర్ మురళిపై సస్పెన్షన్ వేటు వేశారు. తెయినమ్పేట్లో డీఎంకే కార్యకర్తల సెలెబ్రేషన్స్ను అడ్డుకోవడంలో విఫలమైనందుకు ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు సీఎస్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.