హైదరాబాద్ : నాగార్జునసాగర్ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నిక పోలింగ్లో ప్రజలు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నాయకులు జానారెడ్డి తెలిపారు. ఫలితాల వెల్లడి అనంతరం గాంధీభవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. గెలుపొందిన టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్కు అభినందనలు తెలిపారు. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, ప్రతినిధులు, తనని ఆశీర్వదించిన ఓటరు మహాశయులకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజల్లో అవగాహన, చైతన్యం పెంచేందుకు ఈ ఎన్నికలు అవసరమని భావించామన్నారు. తన కర్తవ్యాన్ని నిర్వర్తించేందుకు ఈ ఎన్నికల్లో పోటీ చేసినట్లు తెలిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, కార్యకర్తల్లో మరోధైర్యం నింపేందుకు ఎన్నికల్లో పాల్గొన్నట్లు జానారెడ్డి పేర్కొన్నారు.