బషీరాబాద్ : ఉపాధ్యాయులు కచ్చితంగా సమయపాలన పాటించాలని, పాఠశాలకు వచ్చే విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని వికారాబాద్ జిల్లా విద్యాధికారి రేణుకాదేవి అన్నారు. గురువారం గొట్టిగఖుర్ధు, నవల్గా పాఠశాలలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉపాధ్యాయులు విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉంటే సమయానికి పాఠశాలలకు హాజరుకాకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పాఠశాలకు వచ్చే విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలే చర్యలు తీసుకోవాలని మండల విద్యాధికారి సుధాకర్రెడ్డికి సూచించారు. రోజురోజుకు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతము పెరుగుతుందని గుర్తు చేశారు. ఉపాధ్యాయులు అనుమతి లేనిదే విధులకు గైర్హాజరైతే శాఖపరమైన చర్యలు ఉంటాయన్నారు.
ప్రతి విద్యార్థి కొవిడ్ నిబంధనలు పాటించేలా ఉపాధ్యాయులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అంతకు ముందు విద్యార్థులు ఉన్న తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులకు గణితంకు సంబంధించిన లెక్కలను రాయించారు. చాలా రోజుల తరువాత పాఠశాలలు ప్రారంభించడంతో విద్యార్థులను పలు ప్రశ్నాలు అడిగి పరిక్షించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ కచ్చితంగా మాస్కులు ధరించాలి, శానిటేషన్ చేసుకోవాలన్నారు. అనంతరం విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనంను ఆమె రుచి చూశారు. కార్యక్రమంలో ఎంపీపీ కరుణ, తాసిల్దార్ వెంకటస్వామి, ఎంఈవో సుధాకర్రెడ్డి, ఎంపీవో రమేశ్, సర్పంచ్ విష్ణువర్దన్రెడ్డి, గొట్టిగఖుర్ధు, నవల్గా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు నర్సింగ్రావు, విజయ్కుమార్ ఉన్నారు.